AP CM ChandraBabu: ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు గుడ్ ఫ్రైడే సందర్భంగా తీపి కబురు చెప్పింది కూటమి సర్కార్. గతంలో ఎన్నికల హామీ మేరకు పాస్టర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రాష్ట్రంలోని 8 వేల 427 మంది పాస్టర్లకు నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేశారు.
ఏడు నెలల కాలానికి గాను 30 కోట్ల రూపాయలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. దీంతో.. 7 నెలలకు గాను ఒకొక్క పాస్టరుకు 35 వేల రూపాయల చొప్పున లబ్ధి చేకూరనుంది. యువగళం పాదయాత్రలో.. పాస్టర్లకు లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం.. గౌరవ వేతనం అందించి మాట నిలబెట్టుకున్నారు.
కాగా 2023 జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పాస్టర్లందరికీ గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అమలు చేసింది.
ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా.. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పట్టం కట్టింది. ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి.. ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. గత ప్రభుత్వం హయంలో జగన్ పలు సంక్షేమం పథకాల పేరుతో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. దీంతో ఖజానా మొత్తం పూర్తిగా ఖాళీ అయింది. ఈ క్రమంలో టీడీపీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు.. అమలు చేయడానికి కొంత ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Also Read: టారిఫ్ వల్ల భారీ దిగుమతులు.! మనకు వచ్చే లాభమేంటీ..? ఎదుర్కునే సవాళ్లేంటీ..?
ఇదిలా ఉంటే.. ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తెచ్చింది. దింతో 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కినట్లయింది. అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్-2025కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు. తద్వారా గురువారం నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది.
SC వర్గీకరణ అమలు అధ్యయనానికి విశ్రాంత IAS రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది ప్రభుత్వం. 5 నెలలు పాటు అధ్యయనం చేసిన ఈ కమిషన్ రిపోర్ట్ను ఆమోదించింది కూటమి ప్రభుత్వం.
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. మొత్తం 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా ఏకసభ్య కమిషన్ విభజించింది. గ్రూప్-1 కింద 12 కూలాలను చేర్చి 1% రిజర్వేషన్, గ్రూప్-2 కింద 18 కులాలు చేర్చి 6.5%, గ్రూప్-3 కింద 29 కులాలు చేర్చి 7.5% రిజర్వేషన్ కేటాయించింది.