CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, ఈ రంగంలో విద్యార్థులకు నైపుణ్యాలు పెంచేందుకు ‘క్వాంటం టాక్’ (Quantum Talk) పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు (మంగళవారం) ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిజిటల్ మాధ్యమం ద్వారా వేల మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ కోసం కేవలం 10 రోజుల వ్యవధిలోనే 50 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. ఇందులో 51 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.
ఈ సదస్సులో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించనున్నారు. అమరావతిని క్వాంటం హబ్గా మార్చడంతో పాటు, నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాబోయే మూడేళ్లలో రాష్ట్రం నుంచి లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రోగ్రామ్లో ప్రతిభ చూపిన 3 వేల మందికి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా, ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), సీఎస్ఐఆర్, సీడాక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరాండికర్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి తదితరులు హాజరుకానున్నారు.
Read Also: Tigers Spotted: ఆదిలాబాద్ జిల్లాలో మూడు పులుల సంచారం.. ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్త..