CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి పెద్ద ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వారికి రూ.100 కోట్ల నగదు బహుమతి అందజేస్తామని ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి సాధించిన వారికి ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని సీఎం తెలిపారు.
గతంలో కూడా ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ అందుకుంటే రూ.100 కోట్లు ఇస్తామని తాము ప్రకటించామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచం వేగంగా మారుతోందని, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థే భవిష్యత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్లోనే క్వాంటం టెక్నాలజీ విప్లవానికి నాయకత్వం వహించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సింగ్ వంటి రంగాల్లో ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు రావాలని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పరిశోధనలు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతిభకు గౌరవం, ఆవిష్కరణలకు పూర్తి మద్దతు ఇవ్వడమే ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ మెగా ఆఫర్ ద్వారా ఏపీ నుంచి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు ఎదగాలని, రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు రావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
ALSO READ: Krishna District: రౌడీలకు తగిన బుద్ధి చెప్పిన ఏపీ పోలీసులు.. ఏం చేశారంటే..?