Krishna District: కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో రౌడీషీటర్లపై పోలీసులు వినూత్న చర్యలు తీసుకున్నారు. వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ KTM పండు వ్యవహారంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి శిక్ష తప్పదనే విషయాన్ని తెలియజేస్తూ, బహిరంగంగా అతడిని నడిపిస్తూ కోర్టుకు తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. రౌడీషీటర్ KTM పండు ఇటీవలే నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే అతడు మళ్లీ నేర మార్గంలోకి వెళ్లాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో పెనమలూరు పరిధిలో నివసిస్తున్న శివకుమార్ అనే వ్యక్తితో పండు వివాదానికి దిగాడు. ఈ వివాదం క్రమంగా హింసాత్మక దాడిగా మారింది. పండు తన గ్యాంగ్ సభ్యులు వినోద్, కరీంలతో కలిసి శివకుమార్పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దాడిలో శివకుమార్ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన పోలీసులు, పండు అతని అనుచరులను పోరంకి సెంటర్ నుంచి రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తరలించారు.
ఈ చర్య ద్వారా రౌడీషీటర్లకు బుద్ధి చెప్పడమే కాకుండా, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలని అధికారులు భావిస్తున్నారు. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, నేరాలకు పాల్పడే వారిపై ఎలాంటి సానుభూతి చూపబోమని పెనమలూరు పోలీసులు హెచ్చరించారు.
ALSO READ: Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి