AP Politics: చంద్రబాబు సర్కార్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. పెట్టుబడుల పేరుతో సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు కంపెనీలే కంపెనీలు అన్నట్లుగా వీళ్లంతా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని అన్నారు.
పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు-వైఎస్ షర్మిల
నవంబర్ 14 నుంచి రెండురోజుల పాటు విశాఖ వేదికగా సీఐఐ సమ్మిట్ జరిగింది. దీనికి దేశ, విదేశాల నుంచి వ్యాపారవేత్తలు వచ్చారు. అందులో 600 పైగానే ఎంఓయూలు చేసినట్టుగా ప్రచారం చేయడాన్ని షర్మిల తప్పుబట్టారు. గడిచిన 17 నెలలుగా 22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్లు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పడాన్ని తూర్పార బట్టారు. ఒకప్పుడు పారిపోయిన పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు వస్తున్నారని, ఏపీ ముఖ చిత్రం మారిపోతుందని పదేపదే చెప్పడాన్ని దుయ్యబట్టారు. నేతల మాటలు చూసి నవ్వుకోవాలో, మోసం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదన్నారు.
ఎంఓయూల పేరుతో గడిచిన 11 ఏళ్లుగా మోసం జరుగుతోందన్నారు వైఎస్ షర్మిల. వీటిని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యతగా చెప్పారు. 2014-19 మధ్యకాలంలో సీఎం చంద్రబాబు మూడు సమిట్లు పెట్టారని గుర్తు చేశారు. ఈ మూడు సమిట్ లతో 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారని, 19 లక్షల విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని అప్పటి సీఎం ప్రకటించారు. 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటన చేశారని గుర్తు చేశారు.
గడిచిన 11 ఏళ్లుగా పెట్టుబడులెక్కడ?
మరి ఆ ఉద్యోగాలు వచ్చాయా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. వీటికి సంబంధించి కనీసం 10 శాతం పెట్టుబడులు వచ్చాయా? అంటూ నిలదీశారు. వైసీపీ హయాంలో 2023లో గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. 340కి పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపోజల్ వచ్చినట్టు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వీటి ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని వైసీపీ ప్రకటన చేసిందని వివరించారు.
గడిచిన 11 ఏళ్లుగా ప్రభుత్వాలు వస్తున్నాయని సమ్మిట్లు పెడుతున్నారని అన్నారు. పెట్టుబడులు-ఉద్యోగాలు ఎక్కడని నిలదీశారు షర్మిల. ప్రభుత్వాలు చెప్పినట్టుగా పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని అన్నారు. కనీసం ఉద్యోగాలు లేక ఇక్కుడున్న యువత బయటకు వెళ్లిపోతుందని, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో మాకు నమ్మకం కుదరలేదని తేల్చేశారు.
ALSO READ: కారుమూరి విడుదల.. సంబరపడాల్సిన అవసరముందా?
బ్రాండ్ పేపర్ మీద పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తున్నాయని సంతకాలు చేసి నిరూపించుకోగలరా? అంటూ ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. ప్రత్యేక హోదా అంటూ మోసాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. చివరకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. పోలవరం బ్యారేజ్, విశాఖ స్టీల్ వరకు ఎన్నో కుట్రలు చేశారని అన్నారు.