Sharmila on Amit Shah: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతోంది. పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వైసీపీ లోటును భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్-బీజేపీలు. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఛాలెంజ్ విసిరారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. మీరు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటే, ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల కిందట ఏపీకి వచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో గత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్ల పాలనను ఓ విపత్తుగా వర్ణించారు. అంతేకాదు మ్యాన్ మేడ్ డిజాస్టర్గా చెప్పుకొచ్చారు. అమిత్ షా మాటలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ప్రస్తావించారు వైఎస్ షర్మిల. గడిచిన ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? అంటూ ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరు కదా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఏనాడైనా అడిగారా? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా?
ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. హోంమంత్రి ఎందుకు మౌనం వహించారు? అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
ALSO READ: ఆ విషయం మాటేంటి? సీఎం, డిప్యూటీ సీఎంలకు కాపు నేత లేఖ
ముమ్మాటికీ జగన్ మీకు దత్తపుత్రుడని, ఆడించినట్లు ఆడే తోలుబొమ్మగా వర్ణించారు షర్మిల. పార్లమెంట్లో మీరు పెట్టే బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్. ఇష్టారాజ్యంగా వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారన్నారు.
2019-24 మధ్యకాలంలో జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే, అందుకు కర్మ, క్రియ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పదేళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ.3 లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా @AmitShah గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. YCP @YSRCParty పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే…
— YS Sharmila (@realyssharmila) January 20, 2025