![Killi Kruparani](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/KILLI-1280-x-720.jpg)
Killi Kruparani Resign To YSRCP : ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వైసీపీలో ఆమెకు పెద్ద ప్రాధాన్యం ఎప్పుడూ దక్కలేదు. దీంతో కృపారాణి పార్టీని వీడారు.
కిల్లి కృపారాణి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే కుమారుడు విక్రాంత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కృపారాణి , టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి విక్రాంత్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
కిల్లి కృపారాణి 2009లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా కాంగ్రెస్ నుంచే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడిని ఓడించారు. పార్లమెంట్ కు తొలిసారే ఎన్నికైనా కేంద్ర పదవి ఆమెను వరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. 2019 ఎన్నికల ముందు కిల్లి కృపారాణి వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలి పదవి చేపట్టారు.
Also Read: జాబితా ఓకే..! గెలుస్తారా.. చీలుస్తారా?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిల్లి కృపారాణికి ప్రాధాన్యత తగ్గింది. ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. రాజ్యసభకు పంపుతారని ఆశించారు. కానీ నిరాసే ఎదురైంది. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగానీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా గానీ వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించలేదు. కావాలనే తనను పక్కపెట్టారనే అసంతృప్తిలో ఆమె ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిల్లి కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరికపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.