AP News: ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందించాలని డిసైడ్ అయ్యింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య మూడో వ్యక్తి లేకుండా కేవలం టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తోంది. ఓవైపు వాట్సప్ గవర్నెన్స్.. మరోవైపు పురమిత్ర యాప్ సేవలు విస్తరిస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇంటి వద్ద నుంచి సామాన్యుడు మొబైల్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
ఏపీ ప్రజలకు మరో శుభవార్త
దేశంలో డిజిటల్ గవర్నెన్స్కు మోడల్గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు దగ్గర చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా వాట్సప్ ద్వారానే పొందవచ్చు.
ఆ విధంగా వ్యవస్థను రూపొందించారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఆయా సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. వాట్సప్ గవర్నెన్స్ ఏ విధంగా వినియోగించాలి? ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయని అనే విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. మంచి స్పందన రావడంతో దశలవారీగా మరిన్ని సేవలను అందులోకి చేర్చుతోంది.
పుర మిత్ర యాప్లో మరిన్ని సేవలు
ఇప్పటికే ఆదాయం, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. పోలీస్, రవాణా శాఖల సేవలను దాని పరిధిలోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ వివరాలు, కేసుల స్టేటస్, ట్రాఫిక్ చలాన్లు, టికెట్ల బుకింగ్ వంటివి ఉపయోగించుకోవచ్చు. పోలీస్, రవాణా శాఖకు సంబంధించిన ఈ-చలాన్లు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. అందులోనే చెల్లించే సదుపాయం కూడా ఉంది. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా కానుంది.
మరో విషయానికి వద్దాం. ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తోంది ‘పురమిత్ర’ యాప్. అందులో కూడా కీలక మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఏదైనా సమస్యలుంటే నేరుగా ప్రజలు.. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు. పట్టణాలు, సిటీల్లో నివసించేవారు తమ సమస్యలను ఫోటో సహా ఆ యాప్లో అప్లోడ్ సులభంగా చేయవచ్చు.
ALSO READ: విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్.. ఆపై సభ రద్దు
ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ యాప్ని ఉపయోగిస్తున్నారు. లేటెస్టుగా కొత్త మార్పుల ప్రకారం.. ఒకే ప్రాంతంలో ఒకే రకమైన సమస్యలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఒకే రకమైన ఫిర్యాదులు వస్తే, దానిని ఆరెంజ్ హాట్స్పాట్గా గుర్తిస్తారు. ఎక్కువగా నమోదైతే మున్సిపల్ కమిషనర్ల డాష్బోర్డ్లో హాట్ స్పాట్ లుగా దర్శనమిస్తాయి.
హాట్స్పాట్లకు సంబంధించి కమిషనర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో వాటికి పరిష్కారం చూపాలి. సమస్య పరిష్కారమైన తర్వాత హాట్స్పాట్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అంతేకాదు కమిషనర్లు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారా లేదా అనేది తెలియనుంది. అందుకోసం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించే విధానాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. మొత్తానికి సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యేందుకు టెక్నాలజీ విస్తారంగా ఉపయోగిస్తోంది ఏపీ ప్రభుత్వం.