Rachakonda CP Sudheer Babu: రాచకొండ పోలీస్ కమిషనరేట్ను నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారం, సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడితో పాటు రోడ్డు భద్రతపై రాచకొండ పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని సీపీ వెల్లడించారు.
ఈ ఏడాది కేసుల దర్యాప్తు, పరిష్కారంలో గణనీయమైన ప్రగతి సాధించినట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 21,056 కేసులను పరిష్కరించామని, ఇది మొత్తం కేసుల్లో 78 శాతమని పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలు, పటిష్టమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడేలా చేశామన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది 12 వేర్వేరు కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కృషి చేశామని చెప్పారు. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంచలన హత్య కేసులో ఏకంగా 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధించేలా చేయడంలో దర్యాప్తు బృందం విజయం సాధించిందని అభినందించారు.
రోడ్డు భద్రతలో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో మొత్తం 17,760 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వీరి నుంచి జరిమానాల రూపంలో రూ.3.89 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన, మద్యం మత్తులో వాహనాలు నడిపిన 5,821 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు సుధీర్ బాబు స్పష్టం చేశారు.
సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ ఏడాది సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేసి, రికార్డు స్థాయిలో 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కేవలం అరెస్టులతో సరిపెట్టకుండా, బాధితులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సైబర్ మోసాల్లో కోల్పోయిన సుమారు రూ. 40.10 కోట్లను రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేసినట్లు సీపీ వివరించారు.
యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది డ్రగ్స్ రవాణా చేస్తున్న 495 మందిని అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 20 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో తెలంగాణకు చెందిన వారు 322 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 172 మంది, ఒక విదేశీయుడు ఉన్నట్లు వివరించారు. డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించేందుకు కమిషనరేట్ పరిధిలో కొత్తగా 227 ఎన్డిపిఎస్ (NDPS) అనుమానిత షీట్లను తెరిచినట్లు సీపీ పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను క్లియర్ చేసి, రాచకొండను ఎన్బీడబ్ల్యూ ఫ్రీగా మారుస్తామని సీపీ పునరుద్ఘాటించారు.
Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మాజీ సీఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ విచారణ