AP Government: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు అందించిన రైతుల ప్లాట్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు మ్యాప్స్ వరకే పరిమితమైన రైతు ప్లాట్లకు మౌలిక వసతులు కల్పించేందుకు పనులను ప్రారంభించింది. భూములు ఇచ్చిన రైతులు తమ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపాలని కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్లాట్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయింపు..
ఈ అభివృద్ధి పనుల కోసం 23 వేల కోట్ల నిధులు కేటాయించారు. సీఆర్డీఏ (CRDA) ఈ మౌలిక వసతుల పనులను పర్యవేక్షిస్తోంది. 29 గ్రామాల పరిధిలో రైతులకు కేటాయించే ప్లాట్లను అధికారులు 13 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్లోనూ 1500కు పైగా ప్లాట్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 13 జోన్లలో 11 జోన్లలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన రెండు జోన్లలో కూడా పనులు త్వరలోనే మొదలవుతాయని అధికారులు తెలిపారు. నిధుల కేటాయింపు జరగడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు అంటున్నారు.
అత్యాధునిక మౌళిక వసతులు
ఈ ప్లాట్లలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా, అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా రోడ్ నెట్వర్క్, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, రీ యూజ్ వాటర్ నెట్వర్క్ లాంటి అనేక పనులను చేపట్టనున్నారు. పవర్ ఇంకా ఐసీటీ (ICT) నెట్వర్క్ ఏర్పాటుకు కూడా ప్రణాళిక సిద్ధమైంది.
అధికారులు అందించిన వివరాల ప్రకారం.. కల్పించబోయే మౌలిక వసతుల వివరాలు ఇలా ఉన్నాయి.
రోడ్ నెట్వర్క్ కోసం 1,343.37 కిలోమీటర్లు
మురుగునీటి నెట్వర్క్ కోసం 966.48 కిలోమీటర్లు
నీటి సరఫరా నెట్వర్క్ కోసం 2,391.20 కిలోమీటర్లు
రీ యూజ్ వాటర్ నెట్వర్క్ కోసం 2,951.46 కిలోమీటర్లు
పవర్ & ఐసీటీ నెట్వర్క్ కోసం 11,079.36 కిలోమీటర్లు
ఈ భారీ రోడ్ నెట్వర్క్ ఇంకా ఇతర సౌకర్యాల ఏర్పాటుతో రైతులకు కేటాయించిన ప్లాట్లలో అత్యున్నత జీవన ప్రమాణాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే, రైతుల అసంతృప్తి దూరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: Kavitha Big Shock to BRS: బీఆర్ఎస్ పై కవిత మరో బ్రహ్మాస్త్రం.. ఈసారి దెబ్బ తండ్రికే!