ఏపీ ప్రభుత్వం పాలనా తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కారు తీరుతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నదని,చంద్రబాబు ముందు వెనుకా చూడకుండా ఎన్బీసీని నిబంధనలను ఉల్లంఘిస్తూ అప్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పుల కంటే కేవలం 20 నెలల్లోనే చంద్రబాబు రూ.3.20 లక్షల కోట్ల అప్పులు చేశారని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా పాండమిక్ వచ్చిందని, అప్పుడు పెట్టుబడులు,పన్నులు, రాబడి లేకపోయినా ఎన్బీసీ నిబంధనలను ఉల్లంఘించకుండా సంక్షేమాన్ని అమలు చేశామని, పెట్టుబడులను సమీకరించామని వెల్లడించారు.
చంద్రబాబు విధానాల వలన రాష్ట్ర ఖజానాలో మినిమల్ బ్యాలెన్స్ కూడా లేదని, చంద్రబాబు కేవలం బిల్డప్ మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. బడ్జెట్ విషయంలో అసెంబ్లీలోనూ కూటమి సర్కార్ తప్పులు చెప్పారని, అసలు ఆ సమావేశాల వలన రాష్ట్రానికి ఏం ఒరిగిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, ఆర్థిక విధ్వంసాన్ని ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందన్నారు.తాను ఏదైతే చెప్పానో.. అదే విషయాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించిందని జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయని, ఆదాయం తగ్గిందని, ఖర్చులు పెరిగాయని వైఎస్ జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇదిలాఉండగా, జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు.
వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం మీద చేసిన విమర్శలకు కూటమి నేతలు, ప్రభుత్వంలోని పెద్దలు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని జగన్ కాకి లెక్కలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.గత వైసీపీ హాయాంలోనే భారీగా ఆర్థిక విధ్వంసం జరిగిందని, నిధులన్నింటినీ సంక్షేమం పేరిట ఖర్చుచేశారని, రాష్ట్ర ఆదాయం, రాబడిని పెంచేందుకు జగన్ సర్కార్ ఒక్క కీలక నిర్ణయం కూడా తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి రాబడి తీసుకొచ్చే శాఖల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని,గత ప్రభుత్వంలోని మంత్రులు,కీలక నేతలు పెద్దఎత్తున దోపిడీకి పాల్పడ్డారని గుర్తుచేస్తున్నారు.నవరత్నాల పేరిట జగన్.. ఖజానాను ఊడ్చిపడేశారని, పన్నులు పెంచినా వైసీపీ హయాంలో ఆదాయం ఎందుకు పెరగలేదని కూటమి నేతలు నిలదీస్తున్నారు.
జగన్ ఐదేండ్ల పాలనలో ఏపీ అప్పులు రూ.4 లక్షల నుంచి 7 లక్షల వరకు పెరిగాయని, పెద్దమొత్తంలో అప్పులు చేసి ఉచితాలకు ఖర్చు చేశారని కూటమి ప్రభుత్వంలోని నేతలు గుర్తుచేస్తున్నారు. ఏకంగా సుప్రీంకోర్టు ఉచితాల మీద అసహనం వ్యక్తం చేసినా జగన్ సంక్షేమం పేరిట నేరుగా ప్రజలకు డబ్బలు పంచారని, ఫలితంగా వారి ఆర్థిక స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయం వలన రాష్ట్ర ఖజానా ఖాళీ అవ్వడమే కాకుండా తీవ్ర లోటు ఏర్పడిందని, ఆదాయం పెంపునకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. జగన్ తాను చేసిన తప్పులు, అనాలోచిత నిర్ణయాల గురించి మాట్లాడకుండా.. మొత్తం కూటమి సర్కార్, సీఎం చంద్రబాబు మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు.