BRS vs Congress: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరయింపుల అంశం మరోసారి వేడెక్కింది. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. ఈరోజు పార్టీ ఫిరయింపుల గురించి కేటీఆర్ హరీష్ రావు వంటి నాయకులు మాట్లాడటం అత్యంత సిగ్గుచేటని ఆయన విమర్శించారు. స్పీకర్ తన పరిధి మేరకు రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం తీసుకున్నారని తాము భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ హరీష్ రావు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికారం చేపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ ఇక్కడ నీతులు చెబుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క కూడా బీఆర్ఎస్ నేతల ద్వంద్వ నీతిని ఎండగట్టారు. పార్టీ ఫిరయింపుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బలవంతంగా చేర్చుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆనాడు శాసనమండలి చైర్మన్ పదవిని సైతం లాగేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి వంటి నాయకులను ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చి నేరుగా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కేటీఆర్కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు పార్టీలు మారితే అది అభివృద్ధి కోసమని ఇతరులు మారితే ప్రజాస్వామ్యంపై దాడి అనడం వారి అహంకారానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
స్పీకర్ అధికారాల విషయంలో బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సీతక్క పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్కు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయని ఆ అధికారం మేరకే ఫిరయింపులపై నిర్ణయం తీసుకున్నారని ఆమె వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరితే ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు తమకు అధికారం లేకపోయేసరికి కొత్త రాగాలందుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని తన తప్పులను ఒప్పుకున్న తర్వాతే విమర్శలు చేయాలని ఆమె హితవు పలికారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలని కోరుతున్న బీఆర్ఎస్ గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనదని దీనిపై న్యాయపరంగా కూడా తాము ఎదుర్కోవడానికి సిద్ధమని నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవిస్తూనే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని ఈ క్రమంలో వచ్చే విమర్శలను ప్రజలే తిప్పికొడతారని వారు ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Bhatti Vikramarka: తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి విక్రమార్క..!