AP Govt: ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలుపై దృష్టి సారించిన ప్రభుత్వం, మరోవైపు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఇంతకు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? లబ్ది పొందే వారెవరో తెలుసుకుందాం.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. ఇప్పటికే దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తోంది. అలాగే పలు పథకాల అమలుకు ఇటీవల బడ్జెట్ సమావేశాలలో నిధులను సైతం కేటాయించారు. అతి త్వరలో తల్లికి వందనం, అన్నదాతలకు ఆత్మీయ భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేవలం 24 గంటల వ్యవధిలో ధాన్యం అమ్మిన డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది. అలాగే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రహదారులను అభివృద్ది పరిచారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల వేతనాలను సైతం చెల్లించారు.
ఇక ఎన్టీఆర్ భరోసా పింఛన్ లను ఏకంగా రెట్టింపు పెంచి పంపిణీ చేయడం విశేషం. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా విజయవంతంగా నిర్వహిస్తుండగా, ప్రతి నెలా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పండుగ వాతావరణంలో నగదు పంపిణీ సాగిస్తున్నారు. ఇలా ఎన్నో పథకాలను, అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం కొనసాగిస్తోంది. తాజాగా నాయీ బ్రాహ్మణుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నికల సమయంలో నాయీ బ్రాహ్మణులకు ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దీనితో ఆలయాల నిర్వహణ భాద్యతలలో వీరు కీలకంగా వ్యవహరించనున్నారు.
అంతేకాకుండా దేవాలయాలలో పని చేసే నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం రూ. 25 వేలకు కూటమి ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే ఆలయాల్లో పని చేసే వీరికి ఈ ప్రకటనతో మేలు చేకూరనుంది. అంతేకాకుండా నాయి బ్రాహ్మణులు కులవృత్తిలో భాగంగా సెలూన్ షాపులను నిర్వహిస్తారు. కొందరు సెలూన్ షాప్ లే జీవనోపాధిగా మార్చుకొని జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంది. సెలూన్ షాపులకు రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఏపీ బడ్జెట్ లో రూ. 150 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించడం విశేషం.
Also Read: Sharmila on Jagan: కర్త, కర్మ, క్రియ జగన్.. అంతా నాశనం చేశారు.. షర్మిళ సంచలన కామెంట్స్
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ బడ్జెట్ ను రూపొందించిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇచ్చిన, ఇవ్వని హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన సాగిస్తున్నారని టీడీపీ క్యాడర్ ప్రచారం సాగిస్తోంది. మొత్తం మీద నాయీ బ్రాహ్మణుల కోసం ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.