AP Govt: ఏపీలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో 2260 టీచర్ల ఉద్యోగాలకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అలాగే న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న 245 పోస్టుల భర్తీకి ఓకే చెప్పడం జరిగింది.
పాఠశాల విద్య శాఖకు సంబంధించి 2260 టీచర్ పోస్టుల భర్తీకి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం వేసింది. సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా 1136 ఎస్జీటీ (స్పెషల్ గ్రేడ్ టీచర్), 1124 స్కూల్ అసిస్టెంట్లు మొత్తం 2,260 ఖాళీగావున్న అదనపు పోస్టులుగా మార్చుతూ గత నెల 15న పాఠశాల విద్యాశాఖ ఓ జీవో జారీ చేసింది. దానికి మంగళవారం జరిగిన చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి శిక్షణ ఇవ్వనున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్పెషల్ టీచర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అర్హత కలిగినవారిని ఎంపిక చేస్తారు.
ఈ నియామకంలో అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం ఆయా విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.
ALSO READ: 22న తిరుమల వెళ్తున్నారా? ఫ్రీ సర్వీసు మీ కోసమే
ఏపీ హైకోర్టులో వివిధ కేటగిరీలలో 245 పోస్టుల కల్పనకు మంత్రి మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లా జడ్జి కేడర్లో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్ II), రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఎడిటర్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సెక్షన్ ఆఫీసర్లు, కోర్ట్ ఆఫీసర్లు, స్క్రూటినీ ఆఫీసర్ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. దీనికి సంబంధించి రేపో మాపో నోటిషికేషన్ ఇవ్వనుంది.
వాటితో పాటు అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అప్పల్ డివిజన్ స్టెనో, అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కాపియర్ మెషిన్ ఆపరేటర్లు, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాయి.
వీటితోపాటు ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాజెక్ట్ లీడర్, మాడ్యూల్ లీడర్లు, వెబ్ డిజైనర్ల అదనపు పోస్టులకు అనుమతిని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. వివిధ కేటగిరీలలో దాదాపు 245 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.