AP Govt On Tesla: టెస్లా కార్ల కంపెనీ ఇండియాలో ఎక్కడ ప్లాంట్ పెట్టబోతోంది? దక్షిణాదిలో పెడుతుందా? మహారాష్ట్రకు వెళ్తుందా? ఒకవేళ దక్షిణాది అయితే.. ఏ రాష్ట్రం వైపు చూస్తోంది? తమిళనాడు, తెలంగాణ, ఏపీ.. టెస్లా చూపు ఎటువైపు అన్నదే ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఏపీ ప్రభుత్వం టెస్లా ప్రతినిధులతో మంతనాలు చేస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
టెస్లా కోసం ఏపీ ప్రయత్నాలు
అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లా పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తీవ్ర ప్రయత్నాలు జరుగుతోంది. టెస్లా వస్తే ఏపీ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని, ఆ తర్వాత పెట్టుబడులు వస్తాయని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో టెస్లా ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆ కంపెనీ కంపెనీ ఎక్కడ పెడుతుందనేది కొద్దిరోజుల్లో క్లారిటీ రావచ్చని అంటున్నారు.
ఇండియాలో కార్ల పరిశ్రమ పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతోంది. ఇండియా వాహనాలకు అతిపెద్ద మార్కెట్ కావడంతో ఆ కంపెనీ దృష్టి ఇండియాపై పడింది.దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు ఇస్తోంది. దీనికితోడు పొడవైన తీరప్రాంతం, పోర్టులు, హైవేలు అనుకూలంగా ఉన్నాయి.
భూముల పరిశీలన
టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులుగా అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ ఏడాదిలో మంత్రి లోకేశ్ అమెరికా పర్యటనలో టెక్సాస్లోని ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. పెట్టుబడులను రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పాలసీలు, రాయితీల గురించి వివరించారు. ఆపై ఆ కంపెనీని ఆహ్వానించారు కూడా.
ALSO READ: జనసేనాని కాదు ‘భజన’ సేనాని
పరిశ్రమ ఏర్పాటుకు టెస్లా నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని భావించింది ప్రభుత్వం. ఇప్పటికే పారిశ్రామికవాడల్లో భూములను కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఐదు రోజుల కిందట ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు మేనకూరు పారిశ్రామికవాడను సందర్శించారు. ఒకవేళ టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి, వసతులను క్షుణ్నంగా పరిశీలించారు.
నెల్లూరు బెటరన్నది అధికారుల మాట
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామికవాడలోని 500 ఎకరాల భూమి ఉంది. ఒకవేళ ఆ కంపెనీ వస్తే ఆ భూమి కేటాయించేందుకు రెడీ అవుతోంది. ఎందుకంటే మేనకూరు, క్రిస్ సిటీ, శ్రీసిటీ ప్రాంతాలకు చెన్నైకి కేవలం 120 కిలోమీటర్లు దూరంలో ఉంది. కృష్ణపట్నం పోర్టు, తిరుపతి, చెన్నై ఎయిర్పోర్టులు జాతీయ రహదారులు దగ్గరగా ఉండడంతో టెస్లాకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఒకవేళ ఆ కంపెనీ తమిళనాడులో పెట్టాలని భావించినా, తమకు అడ్వాంటేజ్గా మారుతుందని ప్రభుత్వ అధికారుల మాట. ఇదికాకుండా ఉమ్మడి చిత్తూరు సత్యవేడు నియోజకవర్గంలో భూములను పరిశీలించారు. టెస్లాను రప్పించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రేపో మాపో ఆ కంపెనీ ప్రతినిధులు ఏపీకి వస్తారని అంటున్నారు.
గత టీడీపీ హయాంలో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు సీఎం చంద్రబాబుకు ఉన్న ఇమేజ్తో అనంతపురం జిల్లాకు ఆ పరిశ్రమ వచ్చింది. మొత్తానికి ఇండియాలో టెస్లా కంపెనీ పెట్టడం అయితే ఖాయం. అక్కడ అనేది ఆసక్తికరంగా మారింది.