యోగాసనాలతో గిన్నిస్ రికార్డ్ లు సొంతం చేసుకున్న వారు ఉన్నారు. అయితే ఈ రికార్డులపై ఇప్పుడు ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. ఎంత ఎక్కువమందితో యోగా చేయిస్తే అంత పెద్ద రికార్డు అన్నమాట. ఇప్పటి వరకు భారత్ లో యోగా పేరిట ఉన్న రికార్డులు ఇలా ఉన్నాయి.
– 2018లో రాజస్థాన్లోని కోటాలో 1,00,984 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం రికార్డుల్లో కెక్కింది.
– గుజరాత్లోని సూరత్లో 2023లో 1.53 లక్షల మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. దీంతో కోటా రికార్డ్ బద్దలైంది.
– ఇప్పుడీ రికార్డ్ ని బీట్ చేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. రికార్డ్ బ్రేక్ చేసే సామూహిక యోగా కార్యక్రమానికి విశాఖను వేదికగా ఎంపిక చేసింది. ఇక్కడ జరిగే యోగా కార్యక్రమానికి దాదాపు 5 లక్షలమందిని సమీకరించాలని నిర్ణయించింది. కనీసం రెండున్నర లక్షలమందితో యోగా చేయించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అంతే కాదు.. విశాఖలో యోగా కార్యక్రమం జరిగే రోజు, ఏపీ వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో సామూహిక యోగాసనాల కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. అంటే విశాఖలో రెండున్నర లక్షలమందికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా మరింతమంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. గిన్నిస్ బుక్ నిర్వాహకుల్ని కూడా ఏపీ ప్రభుత్వం సంప్రదించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం..
జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పదేళ్ల క్రితం దీన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈసారి 11వ యోగా దినోత్సవం ఘనంగా జరగాలని, విశాఖ కేంద్రంగా రికార్డలు బద్దలయ్యేలా కార్యక్రమం జరగాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వస్తారు. విశాఖలో ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, స్థానిక పాఠశాలలు, క్రికెట్ గ్రౌండ్స్, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్, వివిధ క్రీడా ప్రాంగణాలు, నేవీ పరిధిలో ఉన్న మైదానాలు.. ఇతర ఖాళీ ప్రాంతాలను యోగా కార్యక్రమం నిర్వహణకు ఎంపిక చేశారు. ఆర్కేబీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు సముద్ర తీర ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారు.
యోగాపై అవగాహన పెంచేందుకు ఇటీవల వివిధ మున్సిపాల్టీల పరిధిలో యోగాసనాలు నేర్పిస్తున్నారు. పుర ప్రజలకు ఉచితంగా యోగాసనాలు నేర్పిస్తున్నారు అధికారులు. యోగా శిక్షకులను నియమించుకున్నారు. యోగా మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు. జూన్-21న జరిగే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఈ కార్యక్రమ నిర్వహణ గురించి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించారు.
జిల్లాల్లో సచివాలయాల పరిధిలో ప్రస్తుతం సర్వే జరుగుతోంది. విశాఖలో జరిగే యోగా కార్యక్రమానికి ఎవరెవరు హాజరవడానికి ఆసక్తిగా ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. మిగతా వారు కనీసం సచివాలయాల పరిధిలో జరిగే యోగా దినోత్సవానికి హాజరయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్నవారు కూడా జూన్-21 ఉదయం యోగా చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. మరి సూరత్ రికార్డ్ ని ఏపీ అధిగమిస్తుందా..? ఏపీలో జరిగే యోగా కార్యక్రమంలో ఎంతమంది ప్రత్యక్షంగా, ఇంకెంతమంది పరోక్షంగా పాల్గొంటారు..? అనే విషయాలు జూన్-21న తేలిపోతాయి.