BRS: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఊహించలేదు. ఆ విధంగా మారిపోయాయి రాజకీయాలు. వేగంగా నిర్ణయాలు తీసుకోలేని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. నేతలపై సస్పెన్ష్ వేటు వేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నాయి. అప్కోర్సు.. కవిత విషయంలో అదే జరిగింది.
కవిత వ్యవహారం బీఆర్ఎస్లో కాక రేపుతోంది. ఆమెపై వేటు వేయాల్సిందేనని ఓ వర్గం పట్టుబడుతోంది. మరో వర్గం అలాంటి పని చేయవద్దని వారిస్తోంది. బయటవారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో సొంత మనిసిని బయటకు పంపడం సరికాదని అధిష్టానం చెవిలో పడేశారట కొందరు నేతలు. దీంతో కవితకు షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న విషయంలో కాస్త వెనక్కి తగ్గిందని అంటున్నారు.
గురువారం రోజంతా జరిగిన పరిణామాలను గమనించింది పార్టీ హైకమాండ్. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత బోయినపల్లి వినోద్కుమార్ రంగంలోకి దిగారు. ఆయనతో ఓ స్టేట్మెంట్ చేయించింది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని అన్నారు. ఇలాంటివి చాలా పార్టీల్లో చూశామని, త్వరలో అన్ని సర్దుకుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కవితకు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి ఆమె మీడియా ముందు మాట్లాడలేదని, చిట్ చాట్లో మాత్రమే చెప్పారన్నారు. కవిత విషయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారాయన. ఆమెలో ఈ స్థాయి ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసిందన్నారు. అన్ని పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేసిందన్నారు. బీజేపీతో ఆ పని చేయలేదని గుర్తు చేశారు. ఒకవేళ ఆ పని చేయాలంటే ఎప్పుడో వెళ్లేదని చెప్పకనే చెప్పారు.
ALSO READ: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. గడువు పెంపుతో రిలాక్స్
రేపటి రోజున బీఆర్ఎస్ దారి ఎటు? నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసేందుకు రెడీ అవుతుందా? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇంత జరిగిన తర్వాత బీజేపీతో ఆ పార్టీ పొట్టుపెట్టుకునే సాహసం చేయదని అంటున్నారు. ఒకవేళ లోలోపల రహస్య ఒప్పందం జరిగితే అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
కవిత తన లేఖతోపాటు చిట్చాట్లో ఓ విషయాన్ని ప్రస్తావించారు. నేతలు, కార్యకర్తలు మాట్లాడుకున్న మాటలనే తాను ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేయకపోవడానికి ఇదీ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఎటుచూసినా కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడినట్టే!