మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదా వ్యవహారం, ఏపీ హైకోర్టు నోటీసులతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేమంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన నోటీసుని జగన్ హైకోర్టులో సవాల్ చేయగా.. తాజాగా హైకోర్టు ఈ విషయంపై స్పందించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి, స్పీకర్ కార్యదర్శికి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కి, శాసనవ్యవహారాల కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వారిని కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది.
అసలు హోదా ఎవరికిస్తారు?
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాల శాసన సభలు, శాసన మండళ్ల నిర్వహణ, విధుల గురించి ప్రస్తావన ఉంది. వాస్తవానికి 1977వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా అనే సమస్య ఉత్పన్నం కాలేదు. 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే పోస్ట్ కి చట్టబద్ధత కల్పించారు. 1977లో తయారు చేసిన నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే గుర్తింపు, ఆ పార్టీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష నేత అనే హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10 శాతం సభ్యులు ఉండాలి. అంటే లోక్ సభలో 55 సీట్లు, ఏపీ అసెంబ్లీ విషయానికొస్తే 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్షం అనే గుర్తింపు వస్తుంది. ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్నవారిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు.
లాభమేంటి?
ప్రధాన ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఇస్తారు. సభలో సీట్ల కేటాయింపులో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రభుత్వం తరపున పీఎస్, పీఏ, ఇతర సహాయ సిబ్బందిని నియమించుకోవచ్చు. అలవెన్స్ లు ఉంటాయి. ఇక సభా సమావేశాల్లో ర్చల సందర్భంగా స్పీకర్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగా వస్తోంది. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ఉంటుంది. బిల్లులపై చర్చ జరిగే సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని బట్టి వారికి సమయం కేటాయిస్తారు. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్షనేత హోదా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
కోర్టు తీర్పులున్నాయా?
గతంలో కూడా ఇలాగే ప్రతిపక్ష నేత హోదా కోసం విపక్షాలు కోర్టు మెట్లెక్కిన ఉదాహరణలున్నాయి. 16,17 లోక్ సభల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన స్థానాలను గెలుచుకోలేదు. 2014లో కేవలం 44 సీట్లకే పరిమితం కాగా, 2019లో కాంగ్రెస్ కి 52 స్థానాలు దక్కాయి. అంటే ప్రతిపక్ష నేత హోదాకు కావాల్సిన 55 స్థానాలను కాంగ్రెస్ అందుకోలేదు. అయితే లోక్ సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఆ హోదాకోసం పట్టుబట్టింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ సుప్రీం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఆ ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు కూడా ఏపీ హైకోర్టు జగన్ పిటిషన్ పై ఇలాగే స్పందిస్తుందనే అంచనాలున్నాయి. స్పీకర్ కు నోటీసులు జారీ చేసినా, ఆయన సమాధానం ప్రకారం హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
జగన్ కి ఏం కావాలి?
జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఉన్నా కూడా అసెంబ్లీకి రాలేరని అంటున్నారు. కేవలం దాన్ని ఓ సాకుగా చూపించి ఆయన అసెంబ్లీకి ఎగనామం పెడుతున్నారని, అనర్హత వేటు పడకుండా గవర్నర్ వచ్చినప్పుడు మాత్రమే సభకు వస్తున్నారని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదాతో పాటు అసెంబ్లీలో సభా నాయకుడి తర్వాత మాట్లాడే సమయం కేటాయిస్తారనే మాట వాస్తవం. మిగిలిన సభ్యులకు సహజంగా 2 నిమిషాలిచ్చినా.. దాన్ని పొడిగించే విచక్షణ స్పీకర్ కి ఉంటుంది. కానీ జగన్ తనకు టైమ్ తక్కువ కేటాయిస్తారని ముందుగానే ఫిక్స్ అయ్యారు. అందుకే తాను సభకు రావట్లేదని అంటున్నారు. ఒకసారి వచ్చి చూడంటి, మీకు సమయం ఇవ్వకపోతే అడగండి అంటూ టీడీపీ నేతలు జగన్ ని కవ్విస్తున్నా.. ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. వైనాట్ 175 అంటూ బీరాలు పలికి 11 సీట్లకు పరిమితం కావడంతో జగన్ అహం దెబ్బతిన్నదని, అందుకే ఆయన అసెంబ్లీకి రానంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇంతకీ జగన్ కి కావాల్సింది ప్రతిపక్ష నేత హోదాయేనే అని వారు కౌంటర్ ఇస్తున్నారు.