AP Housing Site Application: ఏపీలో ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు పెంపు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
AP Housing Site Application: పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో రెండు వారాలు గడువు పొడిగించింది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ. 2.50 లక్షల సహాయం చేస్తుంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం చేయనున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సొంత ఇంటి కల నెరవేరనుంది. ఈ పథకం కింద అర్హులను ఎంపిక చేసేందుకు ప్రతి గ్రామంలో సర్వే బృందాలను నియమించి, అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో సర్వే బృందాలు అర్హులను గుర్తించే పనిని చురుగ్గా చేస్తున్నాయి. గ్రామాల్లో ఇల్లు లేని వారి వివరాలను ఆవాస్ ప్లస్ 2024 అనే ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దే వారి ఫేసియల్, బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు అయినా, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో బిల్లులు రాలేదు. దీంతో కూటమి సర్కారు ఆ ఇళ్లను పూర్తి చేసేందుకు బాధ్యత తీసుకుంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు అదనంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. సొంత స్థలం ఉండి, ఇళ్లు లేని వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు, తాజాగా డిసెంబర్ 14 వరకు పొడిగించారు.
దరఖాస్తుదారునికి దేశవ్యాప్తంగా ఎక్కడా పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు
సొంత స్థలం తప్పనిసరిగా ఉండాలి.
కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి.
గ్రామ, వార్డు సచివాలయం పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ ను కలవాలి.
లబ్దిదారుడి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలి.
అధికారులు ఆవాస్ ఫ్లస్ ద్వారా దరఖాస్తుదారుడి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు.
అధికారులు పాత ఇల్లు లేదని, సొంత స్థలం ఉందని నిర్ధారించుకుని ఫొటోను అప్లోడ్ చేస్తారు.
అర్హుల వారి జాబితాను విడుదల చేస్తారు.
చివరిగా నిధుల విడుదల
అర్హులైన లబ్దిదారులు గ్రామ వీఆర్వో లేదా డిజిటల్ అసిస్టెంట్ సంప్రదించాలి.
దరఖాస్తు ఫారమ్ తో పాటు సంబంధిత పత్రాలు సమర్పించాలి.
వివరాలను ఆన్ లైన్ చేయించుకోవాలి. అనంతరం వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు ఆమోదం తెలిపితే ఇంటి స్థలం గ్రాంట్ అవుతుంది.