Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘నైపుణ్య గణన’ (Skill Census) కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు.
ముఖ్యంగా రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన ‘నైపుణ్యం పోర్టల్’ పనితీరును, విశిష్టతను లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. దేశంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి తక్షణమే కేంద్ర సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ వివరణ పట్ల ఆసక్తి కనబరిచిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. నైపుణ్య గణనకు అవసరమైన సహకారం అందిస్తామని సానుకూలంగా స్పందించారు.
అలాగే, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’కు.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్టార్టప్ హబ్ మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు. ఈ హబ్లో AVGC-XR, WAVEX ఫ్రేమ్వర్క్ కింద యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఏఆర్/వీఆర్ (AR/VR) వంటి రంగాల్లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఇండియా ఏఐ మిషన్’ కింద రాష్ట్రంలో కృత్రిమ మేధ విస్తృతికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ సమావేశంలో లోకేష్ వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు ఉన్నారు.