AP Minister Satya Prasad: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏపీ మంత్రి సత్య కుమార్ సెటైర్లు వేశారు. ధరణి పేరుతో కేటీఆర్ తెలంగాణలో భూకబ్జాలు మొదలు పెట్టారని, ఏపీలో జగన్ అదే దారిలో వెళ్లారని, గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫాలో అయ్యాడని విమర్శించారు. దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా మీరంతా ఒక్కటే జాతి అని, మీరంతా ప్రజలను దోచుకునే దారిలోనే వెళ్లారని, అందుకే ప్రజలు మిమ్మల్ని మూకుమ్మడిగా ఇంటికి పంపించారని చురకలంటించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిత్యం ప్రజల్లో తిరిగాడని, అలాంటిది ఆయన ఎలా ఓడిపోయాడో తనకు అర్థం కావడం లేదని కేటీఆర్ ఓ మీడియా సమావేశంలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఫైర్ అయ్యారు. కేతిరెడ్డి ప్రజల్లో తిరిగి ఉండొచ్చుగాక, కానీ, ఏ అవసరం కోసం తిరిగాడు? కబ్జా చేయడానికి ఎక్కడ మంచి భూములు ఉన్నాయి? ఎక్కడ ఆస్తులు ఉన్నాయి? అని చూడటానికే కదా అంటూ ఆరోపించారు. గుడ్ మార్నింగ్ పేరుతో కేతిరెడ్డి చేసింది అదేనన్నారు. ఇప్పుడు మీరంతా ఒక చోటికి చేరారని, ఒకరికొకరు మంచోళ్లని సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
ధరణితో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద భూమాఫియాను నడిపిందని సత్య కుమార్ ఆరోపించారు. అదే దారిలో కేటీఆర్ మిత్రుడైన కేతిరెడ్డి కూడా ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడన్నారు. చివరికి చెరువులు, కొండలు, గుట్టలను కూడా ఆక్రమించాడని ఆరోపణలు చేశారు.
‘ధరణి’తో మీరు తెలంగాణలో భూకబ్జాలు మొదలుపెట్టారు.
‘గుడ్ మార్నింగ్’తో కేతిరెడ్డి మిమ్మల్ని ఫాలో అయ్యాడు.
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు.. తెలంగాణలో మీరు, ఆంధ్రాలో జగన్, ధర్మవరంలో కేతిరెడ్డి భూదోపిడీ చేశారు.
కేటీఆర్పై ఫైర్ అయిన ఏపీ మంత్రి సత్యప్రసాద్
Follow @bigtvtelugu for… https://t.co/Is10bEEeot pic.twitter.com/amqQ5zxR0m
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2024
తెలంగాణ జీడీపీ పెరగడం లేదని, కేసీఆర్ కుటుంబ జీడీపీ పెరుగుతుందని తాను గతంలో విమర్శించినందుకు కేటీఆర్ తనను ట్విట్టర్లో బ్లాక్ చేశారని సత్య కుమార్ గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అలాగే బ్లాక్లో ఉంచారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న ఆయనను విమర్శ చేస్తే సహించలేకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తాను విమర్శిస్తే బ్లాక్ చేయడం ఒక చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని సూచిస్తుందని లేదంటే అహంకారమైనా అయి ఉండాలని ఆరోపించారు. విమర్శను స్వీకరించలేని వారు రాజకీయాల్లో ఉంటారా? అని సెటైర్ వేశారు.