ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై ఇటీవల కొందరు సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్ లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించి రోజుల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ అనుచిత పోస్టింగ్ ల విషయంలో రాజకీయ కోణం లేకపోవడం గమనార్హం. కేవలం ఫ్యాన్ వార్ వల్లే ఈ పోస్టింగ్ లు పెట్టారని అంటున్నారు పోలీసులు.
ఫ్యాన్ వార్..
మెగా ఫ్యామిలీ హీరోలకు గతంలో ఉమ్మడిగా అభిమానులు ఉండేవారు. కానీ తర్వాత ఏ హీరోకి ఆ హీరోకి విడివిడిగా ఫ్యాన్ బేస్ మొదలైంది. ముఖ్యంగా “చెప్పను బ్రదర్” అనే డైలాగ్ తర్వాత ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ఆర్మీగా పిలుచుకోవడంతో అల్లు ఆర్మీ.. మెగా ఫ్యాన్స్ మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందని అనుకోవచ్చు. ఇది చివరకు ఫ్యాన్ వార్ గా మారడం విశేషం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేసిన యువకుడు అరెస్ట్
కర్నూలు జిల్లాకు చెందిన పుట్టపాశం రఘు అలియాస్ పుష్ప రాజ్ మార్క్ శంకర్ పై అసభ్యకరంగా పోస్టింగ్స్ చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/S5WPlJGBTq
— BIG TV Breaking News (@bigtvtelugu) April 16, 2025
నెగెటివ్ పోస్టింగ్స్..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడంతో ఈ ఫ్యాన్ వార్ పీక్స్ కి వెళ్లింది. మెగా హీరోలంతా ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇక పుష్ప-2 విడుదల తర్వాత అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం, దానిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్.. ఇలా రకరకాల కారణాలతో ఈ ఫ్యాన్ వార్ రోజురోజుకీ పెరుగుతోందే కానీ తగ్గలేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతమైన నెగెటివ్ పోస్టింగ్స్ పెట్టుకునేవారు.
పవన్ ని కలసిన అల్లు అర్జున్..
వాస్తవానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఎప్పుడూ విభేదాలు లేవు. ఇటీవల పవన్ కల్యాణ్ కుమారుడికి అగ్నిప్రమాదంలో గాయాలవడంతో నేరుగా అల్లు అర్జున్.. పవన్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం అంతటి సయోధ్య లేదు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునేవారు. కొన్నిసార్లు ఇవి మరీ పర్సనల్ గా వెళ్లాయి. చివరకు పవన్ కుమారుడు మార్క్ శంకర్ పై అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి అనుచిత పోస్టింగ్ పెట్టాడు. వాస్తవానికి ఈ పోస్టింగ్ లు పెట్టింది వైసీపీ అభిమానులేమోనని అనుమానాలు మొదలయ్యాయి. కానీ చివరకు ఆ పోస్టింగ్ పెట్టిన వ్యక్తికి రాజకీయాలతో సంబంధం లేదని, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ ఫ్యాన్ వార్ వల్లే ఇలాంటి పోస్టింగ్ లు పెట్టారని పోలీసులు తేల్చారు.
కర్నూలు రఘు..
పవన్ కల్యాణ్ కొడుకుపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్ పెట్టిన వ్యక్తి కర్నూలుకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ గా తేల్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు గతంలో కూడా ఇలాంటి పోస్టింగ్ లు పెట్టినట్టు గుర్తించారు. అతడికి 5 మొబైల్స్ ఉన్నాయని, 14 మెయిల్ ఐడీలను వాడేవాడని తేల్చారు. రఘు పోస్టింగ్ లు ఎక్కువగా మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాలను రెచ్చగొట్టడం.. వంటి నేరాలకు గాను, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.