AP News : పిల్లలు కాదు అల్లరి పిడుగులు. ఎవరూ మాట వినట్లేదు. తుంటరి పనులు చేస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్కు భయపడట్లేదు. స్కూల్లో టీచర్స్ను కేర్ చేయట్లేదు. చిలిపి చేష్టలు చేసే వాళ్లు కొందరు.. చెయ్య కూడని పనులు చేసేవాళ్లు మరికొందరు. రోజులో ఎక్కువ టైమ్ బడిలోనే ఉంటారు కాబట్టి.. వారిని భరించడం టీచర్లతో కావట్లేదు. ఇటీవల ఓ స్కూల్ హెడ్మాస్టర్ ప్రేయర్ టైమ్లో విద్యార్థులకు సాష్టాంగ నమస్కారాలు చేసి.. గుంజీలు తీసిన వీడియో తెగ వైరల్ అయింది. లేటెస్ట్గా మరో HM పిల్లల తల్లిదండ్రులకు రాసిన లెటర్ సంచలనంగా మారింది.
హెడ్ మాస్టర్ లెటర్ వైరల్
విద్యార్థుల అల్లరిని భరించలేకపోతున్నాం అంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన హెడ్మాస్టర్ తల్లిదండ్రులకు లేఖ రాశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువ అయిపోయాయని.. వారిని దారిలో పెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ లెటర్లో పేరెంట్స్ను హెచ్చరించారు స్కూల్ హెడ్మాస్టర్ నాగ మంజుల.
పిల్లల అల్లరి అంతాఇంతా కాదు..
విద్యార్థులు చేసే తుంటరి పనులనూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఎగ్జామ్స్ టైమ్లో వాటరఱ్ కోసం అంటూ బయటకు వెళ్లి.. అటునుంచి అటే ఇంటికి వెళ్లిపోతున్నారట. అలా వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని వాపోయారు. ఇక పదో తరగతి స్టూడెంట్స్ అయితే మరీ ఓవరాక్షన్ చేశారని చెప్పారు. ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో బెంచీలు విరగ్గొట్టేశారు. ఫ్యాన్లు విరగ్గొట్టారు. స్విచ్ బోర్డులు, ట్యూబ్ లైట్లు పగలగొట్టారు. ఇలా మీ పిల్లలు అదుపు తప్పుతున్నారని.. వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని లేఖలో కోరారు HM నాగ మంజుల. లేదంటే, విద్యార్థుల అల్లరి ఇలానే ఉంటే.. తాము ఇక ఊరుకోబోమని.. అవసరమైతే పోలీసులకు కూడా కంప్లైంట్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
Also Read : సోషల్ సైకోలకు సీఎం సీరియస్ వార్నింగ్
తప్పంతా పేరెంట్స్దేనా?
ఈ లేఖ రాసింది అనంతపురం స్కూల్ హెడ్ మాస్టరే అయినా.. ఆ బాధ అందరు టీచర్లూ అనుభవిస్తూనే ఉన్నారు. రూల్స్ ప్రకారం విద్యార్థులను టీచర్లు కొట్టొద్దు. కొడితే నేరం. ఇటీవల ఈ రూల్ను స్ట్రిక్ట్గా అమలు చేస్తోంది విద్యాశాఖ. ఎప్పుడైతే టీచర్లు కొట్టడం మానేశారో.. వాళ్లు తమను కొట్టరని స్టూడెంట్స్ తెలుసుకున్నారో.. అప్పటి నుంచి పరిస్థితి అదుపు తప్పింది. భయం లేని పిల్లలు బాధ్యతగా ఏం ఉంటారు? అసలే ఈ జనరేషన్ ఎవరి మాటా వినట్లేదు. టీవీల్లో, సెల్ ఫోన్లలో, మొబైల్ గేమ్స్లో హింస ఎక్కువైంది. తప్పుడు స్నేహాలతో దారి తప్పే వాళ్లు ఇంకొందరు. అలా, బడి పిల్లలే అయినా భయంకరమైన అల్లరి చేస్తున్నారు. కొట్టుకోవడం, పగలగొట్టడం, చెప్పిన మాట వినకపోవడం..లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే, ఏడాదంతా కాస్త కంట్రోల్గా ఉన్నా.. లాస్ట్లో ఎగ్జామ్స్ అయిపోయే టైమ్లో విద్యార్థులు మరింత హద్దు మీరుతున్నారు. స్కూల్ ముగిసింది.. ఇక తమను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో తుంటరి పనులు ఎక్కువ చేస్తున్నారు. ఆ లేఖలో అదే ఆవేదన కనిపించింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారంటే.. పరిస్థితి ఎంతగా అవుటాఫ్ కంట్రోలో తెలుస్తోంది. ఆ హెడ్మాస్టర్ చెప్పింది కరెక్టే.. తల్లిదండ్రులే తమ పిల్లలను కట్టడి చేయాలి. వారికి మంచిచెడు వివరించి చెప్పాలి.