ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. 2026 మార్చి నెలలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి టైమ్ టేబుల్ను ప్రకటించింది. మార్చి 16వ తేదీన ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
షెడ్యూల్ ప్రకారం.. మొదటి రోజు మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్షలు జరుగుతాయి. మ్యాథ్స్ పరీక్ష మార్చి 23న నిర్వహించనుండగా, సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ మార్చి 25న, బయోలాజికల్ సైన్స్ మార్చి 28న జరుగుతాయి. మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది. చివరిగా ఏప్రిల్ 1వ తేదీన వొకేషనల్ కోర్సుల పరీక్షలతో ఈ షెడ్యూల్ ముగుస్తుంది.
పరీక్షా సమయాల విషయానికి వస్తే.. మెజారిటీ ప్రధాన పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. అయితే, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ , వొకేషనల్ కోర్సుల పరీక్షలు మాత్రం ఉదయం 11.30 గంటలకే ముగియనున్నాయి. విద్యార్థులకు ప్రశ్నపత్రం చదువుకోవడానికి అదనపు సమయం కేటాయించనున్నారు.
పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. విద్యార్థులు తమకు కేటాయించిన పేపర్ కోడ్లను జాగ్రత్తగా గమనించి పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితాకు అనుగుణంగానే ఈ షెడ్యూల్ను రూపొందించారు. మార్చిలో జరగనున్న ఈ పరీక్షల కోసం ఇప్పటికే పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, రివిజన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.