AP Weather: ఏపీ ప్రజలకు అటు ఎండలు, ఇటు అకాల వర్షాలతో మిశ్రమ వాతావరణం ఎదురుకానుంది. దీనికి సంబంధించి విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, వడగాలులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుంచి తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది.
ముఖ్యంగా రేపు అల్లూరి, పోలవరం ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలు, వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Also Read: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపు.. కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు