Bhogapuram Airport: న్యూఇయర్ వేళ ఏపీ ప్రజలకు తీపి కబురు. ఎన్నాళ్లగా ఊరిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ కానుంది. దీంతో పెట్టుబడిదారులకు డెస్టినేషన్గా మారనుంది. జూన్ నుంచి కమర్షియల్ ఫ్లైట్ల ఆపరేషన్స్ మొదలుకానున్నాయి.
భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం
ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్టు పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు. పనులు దాదాపు పూర్తి కావడంతో విమానం ట్రయల్స్ మొదలుకానున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి నాలుగు నుంచి ట్రయల్స్ మొదలుకానున్నాయి. తొలిసారి ఢిల్లీ నుంచి విమానం ఒకటి భోగాపురం ఎయిర్పోర్టులో ల్యాండింగ్ కానుంది.
అందులో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు, పలువురు ఎంపీలు అక్కడ దిగబోతున్నారు. ట్రయిల్ రన్ కోసం ఎయిర్పోర్టు అథారిటీ ఇప్పటికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ సక్సెస్ అయిన తర్వాత పలు విమానయాన సంస్థలతో కేంద్రం చర్చలు జరపనుంది. అప్పుడు రెగ్యులర్ సర్వీసులపై ఓ స్పష్టత రానుంది.
జనవరి నాలుగు ల్యాండింగ్, కేంద్రమంత్రి-అధికారుల రాక
ఆ లెక్కన జూన్ నుంచి విమానాల రాకపోకలు మొదలు అవుతాయని అధికారుల అంచనా. భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడో ప్రారంభం కావాల్సివుంది. గడిచిన ఐదేళ్లలో అక్కడి పనులు నత్తనడకగా సాగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి పనులు జోరందుకున్నాయి.
ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన మంత్రి కావడంతో ఊహించని విధంగా పనులు సాగాయి. ఎప్పటికప్పుడు వచ్చి పని తీరుని పర్యవేక్షించేవారు ఆయన. నిధుల విడుదల, పర్యావరణ అనుమతులు , సాంకేతిక సమస్యలు తొలగించడంలో చూపిన చొరవ వల్ల పనుల వేగం పుంజుకుంది.
ALSO READ: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్, కఠిన చర్యలు తప్పవు
ప్రస్తుతానికి దాదాపు 95 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారుల మాట. ఇదే జోరు కంటిన్యూ అయితే జూన్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది భోగాపురం ఎయిర్పోర్టు. కేవలం విమానాశ్రయం మాత్రమేకాకుండా విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు నిర్మించ తలపెట్టిన సిక్స్ లైన్ల హైవే పనులు జరుగుతున్నాయి.
జూన్ నాటికి రోడ్లు కూడా దాదాపు పూర్తి కావచ్చని ఓ అంచనా. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. వచ్చే ఏడాది చివరనాటికి లేకుంటే 2027 నాటికి ఎడ్యు సిటీ కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని విమానాలకు కేరాఫ్గా భోగాపురం ఎయిర్పోర్టు మారనుందని ఏపీ ప్రభుత్వ పెద్దల ఆలోచన. భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి అభివృద్ధి జోరందుకోవడం ఖాయం. పారిశ్రామికంగా ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టూరిజం వంటి రంగాలు మెరుగుపడతాయి.