Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భవిష్యత్తుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ మనిషి ఆలోచనను ప్రతిబింబిస్తూ ఆయన లేవనెత్తిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జూలై 8న ప్రారంభం..
విశ్వసనీయ సమాచారం ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోయే జూలై 8న ప్రారంభం కానుంది. అయితే, ఈ కొత్త ఎయిర్పోర్ట్ వస్తోందన్న ఆనందం కంటే, విశాఖ ప్రజల్లో ఆందోళనే ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం, కొత్తది వస్తోంది కదా అని 62 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని మూసేయాలని చూడటమే.
ప్రయాణికుల ఇబ్బందులు
ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుండి నెలకు దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. నగర ప్రజలు కేవలం 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. అదే భోగాపురం వెళ్లాలంటే దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. అంతదూరం ప్రయాణించడం ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. దీనివల్ల ప్రజలపై పెట్రోల్, డీజిల్ భారం విపరీతంగా పెరుగుతుంది. ఒక అంచనా ప్రకారం, నెలకు రూ. 75 కోట్లు, అంటే ఏడాదికి ఏకంగా రూ. 900 కోట్లు కేవలం ఇంధనానికే అదనంగా ఖర్చవుతుంది.
జీఎంఆర్ (GMR) ఒప్పందంపై ప్రశ్నలు
కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్న జీఎంఆర్ సంస్థ మొదటి 10 ఏళ్ల పాటు ప్రభుత్వానికి ఎలాంటి రెవెన్యూ కట్టాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? అవసరమైతే జీఎంఆర్ సంస్థకు మరో ఏడాది పాటు (మొత్తం 11 ఏళ్లు) ఫీజిబిలిటీ వెసులుబాటు కల్పించి అయినా సరే, విశాఖ ఎయిర్పోర్టును ఇంకో ఏడాది పాటు యథాతథంగా నడపాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
డిఫెన్స్కు అప్పగించడం కరెక్ట్ కాదు!
దశాబ్దాల చరిత్ర ఉన్న, ఎంతోమందికి జీవనాధారమైన విశాఖ ఎయిర్పోర్టుకు ఉన్నపళంగా విడాకులు ఇచ్చేసి, పూర్తిగా డిఫెన్స్ (రక్షణ శాఖ)కు అప్పగించేయడం ఎంతవరకు న్యాయం? ప్రజల సౌకర్యాన్ని పణంగా పెట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదనేది ఆయన స్పష్టమైన అభిప్రాయం.
Also Read: పెద్దపల్లికి గుడ్న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!