AP: ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్జాక్షన్లే. ఎవరి దగ్గరా కరెన్సీ నోట్లు ఉండటం లేదు. ఉన్నా.. ఏ వందో, 500 నోట్లో. అది కూడా ఏ వెయ్యో.. పది వేల వరకో. కానీ, ఓ వ్యాపారి దగ్గర ఏకంగా 50 లక్షల నగదు ఉంది. అదికూడా అంతా 500 నోట్లే. ఈ విషయం అతని స్నేహితుడికి తెలిసింది. కట్ చేస్తే.. ఆ వ్యాపారి నుంచి 50 లక్షలు దోచుకున్నారు కేటుగాళ్లు. అసలేం జరిగిందంటే…
కోనసీమ జిల్లా మండపేటకు చెందిన మాజేటి లక్ష్మీనారాయణ కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. 50 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. 60 లక్షల విలువైన రూ.2000 నోట్లు ఇస్తున్నారంటూ అతని ఫ్రెండ్ చెప్పాడు. అలా చేస్తే, తనకు 10 లక్షలు మిగులుతాయని ఆశపడ్డాడు. సెప్టెంబర్ వరకు గడువుంది కాబట్టి.. ఆ రెండు వేల నోట్లను తీరిగ్గా మార్చుకోవచ్చు అనుకున్నాడు. వెంటనే డీల్కు ఓకే అన్నాడు.
కట్ చేస్తే.. ఆ రాత్రి నోట్లు చేతులు మారే స్పాట్కు చేరుకున్నాడు. 50 లక్షల విలువైన 500 నోట్ల కట్టలతో వాళ్లు చెప్పిన చోటికి వచ్చాడు. ఇద్దరు వ్యక్తులు నగదు మార్పిడిపై అతనితో మాట్లాడుతున్నారు. కాసేపు గడిస్తే.. తనకు 10 లక్షలు లాభం వస్తుందనే సంతోషంలో ఉన్నాడతను. కానీ, అంతలోనే అనుకోనిది జరిగింది. సడెన్గా పోలీస్ సైరన్తో ఓ కారు వచ్చి ఆగింది. తాము పోలీసులమంటూ ఓ నలుగురు హడావుడి చేశారు. వాళ్లను బెదిరించి.. లక్ష్మీనారాయణ దగ్గరున్న 50 లక్షలు లాక్కొని అక్కడినుంచి ఉడాయించారు. ఇదీ జరిగింది.
10 లక్షల కోసం కక్కుర్తి పడితే.. ఏకంగా 50 లక్షలు పోయాయని అతను లబోదిబోమన్నాడు. వచ్చిన వాళ్లు పోలీసులు కాకపోవచ్చని అనుకున్నాడు. తనను మోసం చేశారని గుర్తించాడు. వెంటనే అసలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాకీలు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకీ ఆ వ్యాపారిని చీట్ చేసింది ఎవరు? 500 నోట్లు ఇస్తే.. 2000 నోట్లు ఇస్తామని ఎర వేసింది ఎవరు? ఆ డీల్ గురించి చెప్పిన స్నేహితుడే సూత్రధారా? పోలీసులమంటూ వచ్చిన ఆ కేటుగాళ్లు ఎక్కడివాళ్లు? ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలోని కొంతమూరులో జరిగిందీ ఘటన.