AP Fiber Grid Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసును సీఐడీ క్లోజ్ చేసింది. ఐదేళ్ల విచారణ తర్వాత, ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సాక్షాత్తూ సీఐడీనే తేల్చిచెప్పింది. దీంతో కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ను సబ్మిట్ చేసింది సీఐడీ. దీంతో ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి, న్యాయదేవత చిత్రపటానికి కూడా కలిపి పాలాభిషేకం చేశారు.
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టినట్లు ఉందని, ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారించింది. టెరా సాఫ్ట్ సంస్థకు అక్రమంగా నిధులు ఇచ్చారన్న ఆరోపణలకు సాక్ష్యాలు లేవని సీఐడీ తెలిపింది. 2019 నుంచి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఈ కేసు పెట్టినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. రూ.321 కోట్ల స్కామ్ ఆరోపణలు అవాస్తవమని విచారణలో స్పష్టమైందని సీఐడీ తెలిపింది. ఐదేళ్ల తర్వాతైనా, ఫైబర్ కేసులో నిజం నిలబడిందని టీడీపీ శ్రేణుల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Telangana High Court: సిగాచి పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం.. డీఎస్పీ హాజరు కావాలని ఆదేశం
2015లో టీడీపీ హయాంలో రూ.330 కోట్ల విలువైన ఏపీ ఫైబర్నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1 వర్క్ ఆర్డర్ను నిబంధనలను ఉల్లంఘించి, టెండర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీ విచారించింది. టీడీపీ హయాంలో టెరాసాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ను బ్లాక్లిస్ట్ నుండి తొలగించి దానికి టెండర్ ఇవ్వడానికి చంద్రబాబు బాధ్యత వహించారని సీఐడీ అప్పట్లో తెలిపింది. చంద్రబాబు సన్నిహితుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను వివిధ టెండర్ మూల్యాంకన కమిటీలలో చేర్చమని ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు, నారా లోకేశ్తోపాటు మరికొందరిపై గతంలో సీఐడీ కేసులు నమోదు చేసింది. సీఎంగా చంద్రబాబు తన సన్నిహితులకు లాభం చేకూర్చేలా ఏపీ ఫైబర్ గ్రిడ్ విషయంలో వ్యవహరించారని సీఐడీ ఆరోపించింది. తాజాగా ఈ అభియోగాలను సీఐడీ క్లోజ్ చేసింది.