Black Magic Allegation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మ్యాజిక్ కు యత్నించినట్లు ఒక్కసారిగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఏపీలో తీవ్ర కలకలానికి దారి తీసింది. మూఢనమ్మకాలను విశ్వసించే వారు.. తమ ప్రతర్థులను టార్గెట్ చేసేందుకు క్షుద్రపూజలు వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. ఇందుకు సంబంధించి ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యేపైనే దీనిని ప్రయోగించబోయారని వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ మహిళా ఎమ్మెల్యే బండారు శ్రావణి (MLA Bandaru Sravani)పై కొందరు వ్యక్తులు క్షుద్రపూజలకు యత్నించారని తెలుస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నిందితులు.. స్విఫ్ట్ కారులో వచ్చి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్లనువ్వులు విసిరేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే అనచురులు.. కారు వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. దీంతో దుండగులు అప్రమత్తమై.. అక్కడి నుంచి పారిపోయారు. దుండగులు వాడిన కారు AP 39 KX 0986 అనే నెంబర్ కలిగి ఉందని.. గుంటూరుకు చెందిన ఓ మహిళ పేరిట అది రిజిస్టర్ అయినట్లు సమాచారం.
సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై క్షుద్ర పూజల యత్నం?
అనంతపురంలోని ఎమ్మెల్యే శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేసి వెళ్లిన దుండగులు
నిన్న ఉదయం కారులో వచ్చి శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, నువ్వులు విసిరేసి పరారైన దుండగులు
నిమ్మకాయలు వేయడం గమనించిన ఎమ్మెల్యే… pic.twitter.com/euPt7jIskR
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2026
ఇంటిముందు నిమ్మకాయలు, నువ్వులు పారేసిన ఘటనపై ఎమ్మెల్యే శ్రావణి స్పందించారు. ఇది తెలిసిన వారి పనే అని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా తనపై ఇలాగే జరుగుతూ వస్తోందని తెలియజేశారు. ఫలితంగా తమ కుటుంబ సభ్యులు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే క్షుద్రపూజల కుట్ర వెనుక.. తన నియోజకవర్గానికే చెందిన ఓ అసంతృప్త నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గం అనుమానిస్తోంది. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక బండారు శ్రావణి రాజకీయ ప్రస్థానానికి వస్తే.. టీడీపీలోని యువ ఎమ్మెల్యేలలో ఆమె కూడా ఒకరు. అనంతపురం జిల్లాకు చెందిన ఆమె.. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి బరిలోకి దిగి.. వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 8,788 తేడాతో తన ప్రత్యర్థిని ఓడించి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.