Food Poisoning: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కావడంతో భారీ సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో వడ్డించిన మిల్ మేకర్ కూరలో పురుగులు వచ్చాయని.. ఆ విషయాన్ని అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థినులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాసిరకం ఆహారం తిన్న కాసేపటికే సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు.
విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలై.. కొందరు స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నా వార్డెన్ సకాలంలో స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమయంలో విద్యార్థులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయకుండా.. ఒక ప్రైవేటు ఆర్ఎంపీని వసతి గృహానికి పిలిపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. చివరకు పరిస్థితి విషమించడంతో.. గమనించిన స్థానికులు తమ సొంత వాహనాల్లో బాలికలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం విద్యార్థినులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.
హాస్టళ్లలో పర్యవేక్షణ లోపం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ , సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి వండిన మిల్ మేకర్ కర్రీలో పురుగులు వచ్చాయని ఫిర్యాదు చేసినా వార్డెన్ పట్టించుకోకపోవడంతో, సుమారు 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని కొందరు స్పృహ కోల్పోవడంతో… pic.twitter.com/NtG8ktBpVV
— ChotaNews App (@ChotaNewsApp) February 7, 2026