Pawan Kalyan: ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని తంబాళహట్టికి చెందిన అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైందని తెలిపింది. గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్కు వివరించింది. గ్రామానికి రోడ్డు వేయాలని డిప్యూటీ సీఎంను కోరింది. దీపిక విజ్ఞప్తిపై వెంటనే చర్యలు తీసుకుంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
డిసెంబర్ 12వ తేదీ ఉదయం అంధుల క్రికెట్ జట్టును కలిసి అభినందించిన సందర్భంలో టీమ్ కెప్టెన్ దీపిక తమ గ్రామానికి సరైన రోడ్డు లేక వారు పడుతున్న ఇబ్బందులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించింది. ఈ సమస్యపై స్పందించిన డిప్యూటీ సీఎం.. సాయంత్రానికి రోడ్డు నిర్మాణం అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలో రోడ్డు నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేశారు.
కెప్టెన్ దీపిక తన ఊరికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో గంటల వ్యవధిలో మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలోని తంబాళహట్టి రోడ్లను పరిశీలించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హేమావతి నుంచి తంబాళహట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబాళహట్టి వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేశారు.
Also Read: Chandrababu vs jagan : చంద్రబాబుకు క్లీన్చిట్.. మాజీ సీఎం జగన్కు భారీ షాకిచ్చిన ఏసీబీ కోర్టు!
వరల్డ్ కప్ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రోత్సాహకాలు అందించారు. అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు రూ.84 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని వ్యక్తిగత సంపాదన నుంచి అందించారు. ప్రతీ క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పుల చెక్కుల అందజేశారు. వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.