Chandrababu Comments Over Jagan: నాయకుడు అంటే సింహాలు, పులులు అని చెప్పడం కాదు.. సమర్థవంతమైన పాలన అందించేవాడు నాయకుడని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పై పలు వ్యాఖ్యలు చేశారు.
తాము విడుదల చేసిన మేనిఫెస్టో చాలా బాగుందని ఆయన అన్నారు. నాయకుడు అంటే దూరదృష్టి ఉండాలి.. మంచిపరిపాలనను ప్రజలకు అందివ్వాలి.. కానీ, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని వ్యక్తి నాయకుడు కాదని, వ్యవసాయానికి పెద్దపీట వేసే వ్యక్తి నాయకుడంటూ జగన్ పై ఫైరయ్యారు. కేవలం బటన్లు నొక్కడానికి ఓ సీఎం అవసరమా అంటూ జగన్ పై మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చినంక కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు.. కానీ, చెప్పిన మాటను పక్కకు పెట్టి కరెంట్ ఛార్జీలు పెంచాడన్నారు. ఎన్నికల ముందు డీఎస్సీ నిర్వహిస్తాం.. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్నావ్.. ఏదీ మరీ అంటూ జగన్ ను ప్రశ్నించారు. తండ్రి ఆశయాలు నెరవేర్చాలని వంగవీటి రాధా నిరంతరం శ్రమిస్తున్నారని.. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని పేర్కొంటూ వంగవీటికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామన బాబు హామీ ఇచ్చారు.
Also Read: బాబుకు ఓటేస్తే.. వదల బొమ్మాలీ అంటూ మళ్లీ వచ్చి.. మీ రక్తం తాగుతాడు: జగన్
దెందులూరులో చింతమనేని అభిమానులు ఈలలు ఎక్కువగా వేస్తారు తక్కువగా పని చేస్తారని.. ఇక నుంచి ఎక్కువగా పని చేయాలని బాబు సూచించారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. తప్పుడు కేసులకు కార్యకర్తలు భయపడొద్దన్నారు.. పెట్టిన కేసులకు వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తనదేనని చంద్రబాబు అన్నారు.