Chandrababu: కూటమి హామీలు చూసి జగన్ కు నిద్రపట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకం ఆగదని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. మంత్రి పెద్దారెడ్డిపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూములు కూడా జగన్ వదలరని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓ గర్భిణి మంచి నీళ్లు అడిగిందని తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్ సతీమణి సమక్షంలోనే వైసీపీ నేతలు ఆమెపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంపై కేసులు పెట్టే పోలీసులు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందని మండిపడ్డారు. హుదాతనం అంటే ఏంటో మంత్రి నేర్చుకోవాలని అన్నారు. మంత్రి ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుక్కోవడంతో పాటు పేదల భూములు లాక్కుంటారని ధ్వజమెత్తారు.
Also Read:ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు
జగన్ ప్రజల ఆస్తులపై కన్నే సారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రసంగించారు.రైతలకు ఇచ్చే పట్టా భూముల పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని ఆరోపించారు. ఓట్ల కోసం వైసీపీ నేతలు వస్తే చేసిన అభివృద్ధిపై నిలదీయాలని అన్నారు.
టీడీపీ హయాంలో అనంతపురాన్ని హార్టీ కల్చర్ హబ్ గా మార్చానని చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ కోసం జగన్ ఏమీ చేయలేదని అన్నారు. తాను తీసుకువచ్చిన దీపం పథకాన్ని జగన్ అమలు చేయలేదని చెప్పారు. ఉద్యోగుల కోసం చంద్రబాబు పలు హామీలను ప్రకటించారు. ఉద్యోగల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.