Gramin Dak Sevak: గుంటూరు జిల్లాలోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ఉత్తమ సేవలు అందించిన డాక్ సేవక్లకు అవార్డులను ప్రదానం చేశారు. వికసిత్ భారత్ సాధనలో తపాలా యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవక్ల సామర్థ్యంపై ప్రశంసలు కురిపించారు. సరైన దిశానిర్దేశం చేస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని.. వికసిత్ భారత్ లక్ష్యానికి వారు వారధులు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా పార్శిల్ పంపిణీ ప్రక్రియలో డాక్ సేవక్లను భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో వీరి సేవలు అమోఘమని కొనియాడిన సీఎం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కోరారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థ తపాలా శాఖ అని.. అయితే ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తపాలా శాఖకు ఏటా రూ. 35 వేల కోట్లు ఖర్చవుతుంటే.. ఆదాయం మాత్రం రూ. 13 వేల కోట్లు మాత్రమే వస్తోందని గుర్తు చేశారు. తపాలా శాఖకు ఎయిరిండియా లాంటి దుస్థితి రాకూడదని.. కాలానుగుణంగా మార్పులు చెందుతూ లోటును లాభాల్లోకి మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హితవు పలికారు.
మరో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తపాలా వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కొనియాడారు. డాక్ సేవక్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వారి పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో పార్శిల్, మెయిల్ నెట్వర్క్లో వేగాన్ని పెంచడంతో పాటు గ్రామీణ డాక్ సేవక్లకు ఈ-స్కూటర్లు అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు.
Read Also: CM Revanth Reddy: నీటి హక్కుల విషయంలో రాజీ పడబోం.. పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి