Harvard University Invitation: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహించనున్న ఏఐ పాలసీ సింపోజియం లో పాల్గొని ప్రసంగించవలసిందిగా ముఖ్యమంత్రికి లేఖ పంపింది. మార్చి 27న హార్వర్డ్ క్యాంపస్లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది.
ఈ అంతర్జాతీయ సదస్సుకు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణకు గర్వకారణం. “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే కీలక ప్యానెల్లో ఆయన ప్రసంగించనున్నారు. డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్ల ప్రభావంపై ఈ సెషన్లో లోతైన చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ప్రతిష్టాత్మక ‘ఏఐ సిటీ’ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను ప్రపంచ వేదికపై వివరించాలని నిర్వాహకులు కోరారు. భూమి, విద్యుత్, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే హార్వర్డ్ అధికారులు ఆయనను కలిసి ఈ సింపోజియంపై ప్రాథమికంగా చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, అకడమిక్ రంగాల మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం. తెలంగాణను ఏఐ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ఈ ఆహ్వానం ఒక అంతర్జాతీయ గుర్తింపుగా నిలుస్తోంది.
Read Also: CM Revanth Reddy: నీటి హక్కుల విషయంలో రాజీ పడబోం.. పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి