CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అరటి, పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాయలసీమలో దాదాపు 40 వేల హెక్టార్లలో సాగవుతున్న అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక మార్కెట్లతో పాటు ముంబై, కోల్కతా వంటి సుదూర ప్రాంతాలకు అరటిని ఎగుమతి చేయాలని సూచించారు. ఇందుకోసం రైల్వే వ్యాగన్లను వినియోగించుకోవాలని, రవాణా కోసం ప్రత్యేక ఏజెన్సీల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, అప్పటివరకు రైతులు నష్టపోకుండా వ్యాపారులతో నిత్యం సమావేశాలు నిర్వహించి ధరలను పర్యవేక్షించాలన్నారు.
మొక్కజొన్న రైతులకు అండగా ఉండేందుకు ‘ధరల స్థిరీకరణ నిధి’ని వినియోగించాలని సీఎం నిర్ణయించారు. మార్కెట్లో మద్దతు ధర లభించని పక్షంలో, ఆ వ్యత్యాసాన్ని నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సీజన్లో 1.42 లక్షల హెక్టార్లలో సాగైన పంట నుంచి 2.04 లక్షల మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఇక పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఐ (CCI) నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రంగు మారిన లేదా తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ సమస్యలు రాకుండా, జిన్నింగ్ మిల్లులకే నేరుగా రవాణా చేసేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: JAGAN-KTR Photo: బెంగళూరులో ఒకే వేదికపై జగన్, కేటీఆర్.. ఫోటో వైరల్