PM Kisan Annadata Sukhibhava: వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ” పథకం రెండో విడత నిధులను విడుదల చేశారు. స్థానిక ప్రజావేదిక నుంచి ఆయన ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా, మొత్తం రూ. 3,200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో ఒక్కో రైతు ఖాతాలో రూ. 7,000 చొప్పున జమ కానున్నాయి. అంతకుముందు సీఎం ‘మన గ్రోమోర్’ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి, అక్కడి రైతులతో ముచ్చటించారు. వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఈ నిధులు రైతులకు అండగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేడు రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామన్నారు. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగష్టులో జమ చేశామన్న సీఎం.. రెండో విడత 3135 కోట్లు మీ అకౌంట్ లో జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలని, రైతుల జీవితాలు బాగుపడాలని అన్నారు. రైతులు కొత్తగా ఆలోచించి వ్యవసాయం చేయాలని, ఆధునిక పద్దతులు అవలంభించి సాగు చేయాలని సీఎం కోరారు. మనం పండించిన పంటలు ప్రపంచానికి చేరువ చేసినప్పుడు రైతులు బాగుంటారని అన్నారు.
రైతుల భవిష్యత్తును మార్చేందుకు ఐదు ‘పంచ సూత్రాలను’ (నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి-టెక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రభుత్వ సహకారం) సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా నీటి భద్రతపై మాట్లాడుతూ, రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించడం వల్లే నేడు ఈ ప్రాంతంలోని రిజర్వాయర్లు 95 శాతం నిండుకుండలా మారాయని, ఇది తన దూరదృష్టికి నిదర్శనమని చంద్రబాబు వివరించారు.