Bhogapuram: విజయనగరం జిల్లా భోగాపురంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇవ్వాల్సిన బాకీ కోసం ఓ యువకుడి చేతులకు తాళ్లు కట్టి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీన్ని అవమానంగా భావించిన బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. అసలు ఏం జరిగింది?
పోలీసుల వివరాల మేరకు.. విజయనగరం జిల్లా రామచంద్రరాజుపేటకు రాజేశ్ అనే యువకుడు.. భోగాపురంలోని మహేశ్ అనే మెకానిక్ వద్ద రూ. 30 వేలు అప్పు చేశాడు. ఎందుకు అప్పు చేశాడంటే.. మెకానిక్ వద్ద ఓ బైక్ ట్రయల్ రన్ చేస్తుండగా అనుకోకుండా ఓ కారుని ఢీ కొట్టాడు.
ఈ విషయాన్ని పరిష్కరించడానికి మహేష్ సోదరుడు మరమ్మతు ఖర్చుల కింద కారు ఓనర్కు రూ. 5000 చెల్లించినట్లు సమాచారం. డ్యామేజ్ అయిన బైక్ ధర, మరమ్మతు ఖర్చులతో సహా మొత్తం రూ. 30 వేలు అయ్యింది.
ఆ డబ్బును రాజేశ్ తిరిగి ఇవ్వడంలో డిలే చేయడం అసలు ఈ వ్యవహారానికి కారణమైంది. శనివారం రాత్రి మహేశ్.. తన స్నేహితులతో కలిసి రాజేశ్ను అడ్డుకున్నాడు. బలవంతంగా మెకానిక్ షెడ్కు తీసుకెళ్లి రాత్రంతా అక్కడే నిర్బంధించి చితకబాదారు. తనకు ఇవ్వాల్సిన రూ. 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. చివరకు ఆదివారం ఉదయం రాజేశ్ చొక్కా విప్పించి చేతులకు, మెడకు తాళ్లు బిగించాడు మెకానిక్. భోగాపురం ప్రాంతంలోని ప్రధాన వీధుల్లో రాజేష్ని తన బైక్కు కట్టి ఈడ్చుకెళ్లారు. దారుణమైన దృశ్యాన్ని చూసిన స్థానికులు, ఫోన్ ద్వారా షూట్ చేశారు.
ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ భోగాపురం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గంటల వ్యవధిలో నిందితులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు ఇతర నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ. నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. అనంతరం రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.