విజయవాడలో భవానీలు మరియు పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘటనపై భవానీలు తప్పుచేశారంటూ పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ముందుగా భవానీలే పోలీసులపై దాడి చేసిన దృశ్యాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
తొలుత కామయ్యతోపు నుంచి దుర్గగుడి వైపు భవానీలు ఆటోలో బయల్దేరిన సమయంలో.. బెంజిసర్కిల్ వద్ద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఆటోను ఆపాడు. చిన్నపిల్లలతో పాటు పదిమందికిపైగా భవానీలు ఒకే ఆటోలో ఉండటంతో.. మరో ఆటో మాట్లాడుకుని వెళ్లాలని సూచించాడు. కాని ఆ సమయంలో ఆటోలో ఉన్న భవానీలు ఆగ్రహంతో దిగివచ్చి.. కానిస్టేబుల్ వాహనాన్ని కింద పడేసి, హెల్మెట్ను నేలకేసి కొట్టి, అతనిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఘటనను వెంటనే సమీపంలోని స్క్రూ బ్రిడ్జి ప్రాంతంలోని పోలీసులకు కానిస్టేబుల్ సమాచారం ఇచ్చాడు. దాంతో అక్కడ భవానీలు ప్రయాణిస్తున్న ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో మరోసారి భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోడ్డుపై నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు.
ALSO READ: Nara Lokesh: విశాఖకు 7 ఐటీ కంపెనీలు.. రేపే శంకుస్థాపన