Civil Supplies Department: పౌర సరఫరా శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. వైసీపీ పాలనలో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడంతో 5 ఏళ్ల కాలంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు సరఫరా చేసే రేషన్, అంగర్ వాడీ కేంద్రాల్లో అవినీతి బట్టబయలైంది. పేదలకు ఇచ్చే పంచదార, అంగన్ వాడీలకు అందించే కందిపప్పు, నూనె తదితర ప్యాకెట్లలో సుమారు 50 నుంచి 100 గ్రాములు తక్కువగా ఉండడం గమనార్హం.
పలు చోట్ల తనిఖీలు
మంగళగిరితోపాటు తెనాలి తదితర ప్రాంతాల్లో నిల్వగోదాములను ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి తనిఖీ చేశారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రతీ ప్యాకెట్ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు బయటపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు.
వారం రోజుల్లో నివేదిక..
రేషన్ పంపిణీలో జరిగిన అవకతవకలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమన్నారు. పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ఒక్కో ప్యాకట్లలో 50 నుంచి 100 గ్రాముల బరువు తక్కువ ఉన్నప్పటికీ అధికారులు పెద్ద విషయం కాదన్నట్లే వ్యవహరించడం గమనార్హం. ఇలా ప్రతి చోట తనిఖీ చేయగా.. అంతటా ఇలానే ఉందని వెల్లడైంది.
Also Read: తొలిసారి క్షేత్రస్థాయి టూర్.. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శన
రూ.200 కోట్లకుపైగా దోపిడీ
అంగన్ వాడీ, వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలోనూ దోపిడీ జరుగుతోంద. తూకంలోనే కాదు ధరల్లోనూ వ్యత్యాసం ఉంటోంది. అధికారుల సహాయంతో వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా సాగుతోంది. పామోలిన్, కందిపప్పు సరఫరాల్లోనే ఏకంగా రూ.200 కోట్లకుపైగా దోపిడీ జరిగిందని వెల్లడైంది. డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లోనూ సుమారు 5 నుంచి 8 కిలోల వరకు తూకం తక్కువగా ఉంటోందన్నారు. ఇలా ఐదేళ్లలో పౌరసరఫరా శాఖలో కోట్లల్లో కుంభకోణం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లలో సంస్థ అప్పులు రూ.40వేల కోట్లకు చేరాయి.