CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం సీఆర్డీయే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు.
‘రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారు. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారు. రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయితీ పెట్టింది. రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేశాం. బెస్ట్ రాజధాని నిర్మిస్తున్నాం.. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నాం. రాజధాని నిర్మాణానికి భూమి కావాలి… ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమాన పడ్డారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు దారి చూపారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చామన్నారు. సమీకరణ విధానాన్ని సక్సెస్ చేసిన చరిత్ర అమరావతి రైతులదేనని కితాబు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదని, ఏపీలో ఈ విధానాన్ని తెచ్చి సక్సెస్ చేశామన్నారు. అమరావతి పనుల రీ-స్టార్ట్ తర్వాత మొదటిగా సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభమైందన్నారు.
‘అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు. అనేక ఉద్యమాలు చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా నేను కూడా జోలె పట్టాను. ఉద్యమానికి అండగా నిలిచాను. పడిన కష్టాలు మరిచిపోవద్దు. మీరు చేసిన త్యాగాల ఫలితాలను మీరే అనుభవించాలి. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఫేజ్-1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారు. భూములిచ్చినందుకు గత పాలకులు మిమ్మల్ని నానా హింసలు పెట్టారు. రాజధాని ఎడారి అన్నారు. వేశ్యల రాజధాని అన్నారు. ఎంతో అపహాస్యం చేశారు. మీకు రెట్టింపు గౌరవం దక్కేలా…రెట్టింపు ఫలాలు అనుభవించేలా మేము చేస్తాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
హైటెక్ సిటీ నిర్మాణం మొదలు పెట్టే నాటికి అక్కడ ఎకరం రూ. లక్ష ఉండేదని, ఇప్పుడు రూ.177 కోట్లకు చేరిందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నామని చెప్పారు. అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. రైతులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారoభం కావాలన్నారు.
‘అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవు. అమరావతిని క్వాంటం వ్యాలీ చేస్తున్నాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. ఒకప్పుడు ఐటీ.. ఇప్పుడు క్వాంటం, డేటా సెంటర్, ఏఐ వంటి టెక్నో రంగాలదే హవా. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం… హ్యండ్ హోల్డింగ్ ఇస్తాం. ఒకసారి జరిగిన తప్పుకు రైతులు, నేను, రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. ళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు.. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. వన్ కళ్యాణ్, బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నాం’ -సీఎం చంద్రబాబు
Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో అభిమానుల హంగామా
దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నారు. దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానన్నారు. సీఆర్డీయే భవనం ప్రారంభం ఏపీ అభివృద్ధి యాత్రకు ఆరంభమని సీఎం అభిప్రాయపడ్డారు.