CM Chandrababu: యూఏఈలో తొలి రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. తొలిరోజు ఐదు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం భేటీ అయింది. దుబాయ్, అబుదాబిల్లోని భారత ఎంబసీకి చెందిన రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబీలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ లతో సీఎం సమావేశం అయ్యారు.
దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, అతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ లో రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. గూగుల్ సంస్థ విశాఖలో ఏఐ డేటా హబ్ ను 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం చేపట్టినట్టు సీఎం వివరించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే యూఏఈలో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపై భేటీలో చర్చించారు. ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను కోరారు.
‘ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భారతదేశం బ్రాండును ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటించినన్ని దేశాలు మరే ఇతర ప్రధాని పర్యటించలేదు. రెండు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు పెరగడానికి ప్రధాని కృషే కారణం’- సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పీ4లో విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను సీఎం శోభా గ్రూప్ ప్రతినిధులకు వివరించారు. అమరావతి రాజధాని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు సీఎం తెలిపారు.
రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని సీఎం ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని పీఎన్సీ మీనన్ను కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అంటూ పేర్కొన్నారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు లాంటి మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతాయని వెల్లడించారు.
విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని సీఎం తెలిపారు. తిరుపతి, విశాఖ, అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను.. కార్యక్రమాలను సీఎం గుర్తు చేశారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని శోభా గ్రూప్ ఫౌండర్ ఛైర్మన్ మీనన్కు సీఎం ఆహ్వానించారు.