CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇల్లు లేని వారి ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సామాజిక పెన్షన్లో ప్రజలు పూర్తి సంతృప్తి ఉన్నారన్నారు. ప్రతి వర్గంలో ఇల్లు లేని వారిని గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తి ముఖ్యమన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రాగ ద్వేషాలు లేవని, పర్ఫార్మెన్స్ ముఖ్యమని చెప్పారు. ప్రజాపాలనపై స్పష్టత ముఖ్యమని, ప్రిపరేషన్ ఉంటే మైండ్ సెట్ మార్చుకోవచ్చన్నారు. పారదర్శకంగా ప్రజలకు లైవ్ లో అన్ని విషయాలు చెప్తున్నామన్నారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా ప్రజలకు మెరుగ్గా సేవలు అందుతాయన్నారు.
జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామన్నారు. అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. బుధవారం ఉదయం సచివాలయంలో 5వ కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పల్లె పండగ 1.0 పనులను గడువు లోపు పూర్తి చేయగలిగామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నరేగా నిధులతో గత ఏడాది చేపట్టిన పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయగలిగామని చెప్పారు.
‘రైతులకి అండగా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించాం. సకాలంలో పనులు పూర్తి చేయగలిగాం. 2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ. 4,330 కోట్ల వేతనాల రూపంలో చెల్లించాం. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 1,056.85 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించాం. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక చేయూతను ఇచ్చింది’ – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read: PV Sunil kumar: IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు, తాను ఓకే.. ఆయన మాటేంటి?
గ్రామ పంచాయతీల స్వయం ఆదాయార్జన మార్గాలపై కూడా దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. టాక్స్, నాన్ టాక్స్ అసైన్మెంట్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణ కార్యక్రమాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని చెప్పారు. ఉద్యోగుల సామర్థ్యం పెంపుకి ఈ శిక్షణా తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు పాలనా సామర్థ్యాల పెంపు కోసం కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు.