Swarnandhra 2047: ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికలను వివరించారు.
2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రతి ఒక్కరి ఆదాయం మరియు జీవన ప్రమాణాలు పెరగడమే రాష్ట్ర సంపదకు నిజమైన విలువ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో పీ-4 (P-4) విధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే సుమారు 10 లక్షల మందిని ఈ పరిధిలోకి తీసుకువచ్చామని ఆయన తెలిపారు.
ప్రజల ఆరోగ్యం వారు తీసుకునే ఆహారం, తాగునీరు మరియు ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన సీఎం.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డును రూపొందిస్తామని, అలాగే ‘కేర్ అండ్ గ్రో’ కార్యక్రమం ద్వారా అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చి, చిన్నపిల్లల్లో ఉండే ఆరోగ్య సమస్యలను బాల్యంలోనే గుర్తించి చికిత్స అందిస్తామని వివరించారు.
రైతులకు మేలు చేసేలా సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తామని, ‘కుసుం’ పథకం కింద అన్ని పంపుసెట్లకు సోలార్ పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, డ్రోన్ల ద్వారా జీవామృతం అందించే సాంకేతికతను వాడుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలోని అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా తిరుపతిని ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా మారుస్తామని, అక్కడ హోమ్ స్టే భవనాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. తిరుపతిలోని అవిరాల చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అందంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించి భూ రికార్డులను పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2027వ సంవత్సరం నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ వివాదాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.