CM Chandrababu Naidu: హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుండి పారిశ్రామిక.. ఐటీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో తాము ఆనాడు అడుగులు వేశామని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రస్థానాన్ని.. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే నేటి ఆధునిక అభివృద్ధికి పునాది అని ఆయన కొనియాడారు.
బెంగళూరు.. చెన్నై వంటి నగరాలను కాదని మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకోవడమే తమ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ముందే ఊహించి.. హైదరాబాద్లో సైబర్ టవర్స్ వంటి నిర్మాణాలతో ఐటీ రంగానికి ఊపిరి పోశామని చంద్రబాబు తెలిపారు. దీనికి కొనసాగింపుగానే ISB, జీనోమ్ వ్యాలీ వంటి ప్రపంచస్థాయి సంస్థలు ఇక్కడ వెలిశాయని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో జీనోమ్ వ్యాలీ ప్రపంచానికే వ్యాక్సిన్ను అందించి.. తెలుగు వారి ప్రతిభను చాటిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో తీసుకున్న ఈ నిర్ణయాల వల్లే నేడు రెండు తెలుగు రాష్ట్రాలు ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉండి.. తలసరి ఆదాయాన్ని పెంచుకోగలిగాయని విశ్లేషించారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలు.. బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం అయ్యాయని.. రాష్ట్ర విభజన కంటే దారుణమైన నష్టాన్ని ఏపీ చూసిందని విమర్శించారు. అయితే ప్రస్తుతం సంక్షేమం.. అభివృద్ధి.. సుపరిపాలన అనే మూడు సూత్రాలతో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని.. ఇకపై క్వాంటం కంప్యూటింగ్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI).. డ్రోన్స్ వంటి టెక్నాలజీలే భవిష్యత్తును శాసిస్తాయని స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని.. గ్రీన్ హైడ్రోజన్.. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో ఏపీ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదని.. సుస్థిర శక్తిని అందించవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం దృష్ట్యా పీఎన్జీ (PNG) వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించామన్నారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సామర్థ్యాన్ని 15-20 శాతం పెంచామని.. ఆధునిక ల్యాబ్స్ ద్వారా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ కాకుండా నిత్యం పరీక్షిస్తున్నామని వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే ‘ఏఐ డాక్టర్’ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని.. ఇది వైద్య రంగంలో గొప్ప మార్పు తెస్తుందని చెప్పారు. అలాగే రైతులకు మేలు చేసేలా ‘ఏఐ అగ్రానమిస్ట్’ సేవలను అందించి.. సాగులో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో నిర్మిస్తున్న స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.