Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం దాని యువ జనాభా అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ యువశక్తిని సరైన దిశలో నడిపిస్తే, 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2047 నాటికి తెలుగువారు ప్రపంచంలోనే నంబర్వన్ కమ్యూనిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 1995 నుండి జ్యూరిచ్కు వస్తున్నానని, అప్పట్లో తెలుగువారు చాలా తక్కువ మంది ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే తెలుగు ప్రాంతంలోనే ఉన్నట్లు అనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్తో పాటు ఐర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్ వంటి దేశాలలో వేల సంఖ్యలో తెలుగువారు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఎన్ఆర్టీ (NRT)లో దాదాపు రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో 400 తెలుగు సంఘాలు యాక్టివ్గా ఉన్నాయని ఆయన వెల్లడించారు.తెలుగువారు విదేశాలలో స్థిరపడినప్పటికీ, తమ సంస్కృతి మరియు సంప్రదాయాలను మర్చిపోకుండా పాటిస్తుండటం గర్వకారణమని ఆయన కొనియాడారు.
తాను గతంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లనే నేడు ప్రపంచంలోని దాదాపు 195 దేశాల్లో తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. తెలుగువారు ఎక్కడున్నా తమ మూలాలను మర్చిపోకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ఇందుకోసం ప్రవాసాంధ్రుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని, దీనివల్ల ఆర్థిక అసమానతలు తగ్గుతాయని వివరించారు.
Read Also: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. ఈరోస్ ప్రతినిధులతో భేటీ