Cyclone Montha: మొంథా తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తుఫాన్ ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలు భయంతో బిక్కుబిక్కు మంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రికి మొంథా తుఫాన్ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ ప్రభావం రాష్ట్రంలోని కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడు జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
ఆయా జిల్లాల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్..
మొంథా తుఫాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ‘ప్రాణనష్టం లేకుండా… ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలి. కాల్వలు, చెరువులకు గండిపడకుండా చూడండి.. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి… రిలీఫ్ క్యాంపులకు తరలించండి. తుఫాను ప్రభావం వల్ల కరెంట్ కట్ చేయాల్సి రావచ్చు… ముందుగానే ప్రజలకు క్యాండిళ్లను సరఫరా జరిగేలా చూడండి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అలర్ట్ గా ఉండండి..
తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. అలెర్టుగా ఉండండి. పునరావాస శిబిరాల్లో ఉండేవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. అధికారులు-ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాలి… క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటే.. ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది. భారీ వర్షాల వల్ల పడే నీరు నిల్వ ఉండకుండా.. కాల్వలు, డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంప్ చేయాలి. విజయవాడ, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం అనేది ఉండకూడదు. తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకూ తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలి.. మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలి. తప్పుడు సమాచారం.. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలి. రైతులకు తుఫాన్ అలెర్టులు ఎప్పటికప్పుడు చేరేలా చూడాలి. పంట నష్టంపై ప్రాథమిక, పూర్తి స్థాయి అంచనాలను రూపొందించుకునే దిశగా ఫోకస్ పెట్టాలి. మొంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని జాతీయ రహదారులపై రాకపోకలను నిలపాలి. రహదారులపై రాకపోకలు నిలపాల్సిన పరిస్థితే వస్తే… సమాచారాన్ని ముందుగానే సమాచారం అందివ్వాలి’ అని సీఎం పేర్కొన్నారు.