పల్నాడు జిల్లా వినుకొండలో వరకట్న వేధింపులు, రంగు పేరుతో అమానుషంగా హింసించిన సంఘటన కలకలం రేపింది. తాను నల్లగా ఉన్నాననే కారణంతో అశుభాలు జరుగుతున్నాయని, దీనికి తోడు అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారంటూ గోపిలక్ష్మి అనే కోడలు తన అత్తారింటి ఎదుటే న్యాయపోరాటానికి దిగింది.
గత జూన్లో కోటేశ్వరరావుతో గోపిలక్ష్మికి వివాహం జరిగింది. పెళ్లైన కేవలం రెండు నెలల నుండే వేధింపులు మొదలయ్యాయని గోపిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తోటి కోడలు రూ. 80 వేలు సంపాదిస్తుందని, తాను సంపాదించడం లేదంటూ కూడా నిత్యం నిందిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకుంది. న్యాయం జరగాలంటూ బాధితురాలు తన అత్తారింటి ఎదుట ఆందోళన చేపట్టింది.
గోపిలక్ష్మి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డను కోటీశ్వరులు అని నమ్మి ఆస్తులు అమ్మి పెళ్లి చేశానని, ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధించడం అన్యాయమని అన్నారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదని తన బిడ్డ చెబుతోందని వాపోయారు. ఈ విషయంపై అడగడానికి వచ్చిన తమపై దాడికి ప్రయత్నించారని, తమను చూడగానే ఇంటికి తాళం వేసి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వినుకొండలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోపిలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తండ్రి స్పష్టం చేశారు.