గత కొద్దిరోజులుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వణిక్కించిన పెద్దపులి కథ ఎట్టకేలకు ముగిసింది. అటవీ శాఖ అధికారులు, పుణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణులు సమన్వయంతో సాగించిన సుదీర్ఘ ఆపరేషన్ విజయవంతమైంది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని అదుపులోకి తీసుకోవడంతో ఇటు అధికారులు, అటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
టెన్షన్ పుట్టించిన గాండ్రింపులు..
శుక్రవారం ఉదయం జిల్లాలోని కూర్మాపురం గ్రామంలో ఒక పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పులి ఉనికిని గుర్తించిన వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది, పులిని సురక్షితంగా పట్టుకునేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మహారాష్ట్రలోని పుణే నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణుల బృందం ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించింది.
చేజారినట్టే చిక్కింది..
మొదట పాడుబడిన ఇంట్లోనే పులిని బంధించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ (Tranquilizer) ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో పులి అధికారుల కళ్లు గప్పి సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీసింది. దీంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. పొలాల్లో పులి ఎక్కడ నక్కి ఉందో తెలియక అధికారులు, పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. గ్రామం చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేసి ఎవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.
సక్సెస్ అయిన రెస్క్యూ ఆపరేషన్..
సాయంత్రం వరకు అటవీ శాఖ సిబ్బంది, పుణే బృందం పొలాల్లో నిశితంగా గాలింపు (Reckon) చేపట్టారు. పులి కదలికలను ట్రాక్ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. సరైన సమయం చూసి పులికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంలో నిపుణులు సక్సెస్ అయ్యారు. మత్తులోకి జారుకున్న పులిని సురక్షితంగా బంధించి.. ప్రత్యేక బోనులోకి తరలించారు.
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో కూర్మాపురం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పొలాలకు వెళ్లాలన్నా, రాత్రి వేళ బయట తిరగాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ఆ భయం పోయిందని రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టుబడిన పులిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ALSO READ: HYDRAA: నగరంలో హైడ్రా గర్జన.. చెరువులు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా భారీ ఆపరేషన్